హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): జీవో 111పై నిర్ణయం తీసుకోవడానికి సమయం పడుతుంది కాబట్టి, హైకోర్టును ఇంకొంత వ్యవధి కోరాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ నగర సమగ్రాభివృద్ధిపై పురపాలకశాఖ అధికారులతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదివారం ప్రగతిభవన్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ మహానగరం చుట్టూ 111 జీవో పరిధిలో ఉన్న ప్రాంతం అభివృద్ధికి కచ్చితమైన, నిర్దిష్టమైన ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
ఈ జీవో పరిధి 84 గ్రామాలు, లక్షా 32 వేల ఎకరాల భూమి, 538 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్నదని, ఇది జీహెచ్ఎంసీ విస్తీర్ణానికి సమానమని పేర్కొన్నారు. అంతర్జాతీయ నగరంగా రూపుదిద్దుకొంటున్న హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి అత్యావశ్యకమని అన్నారు. ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని జలాశయాల రక్షణ, అటవీ ప్రాంతాల్లో పచ్చదనం అభివృద్ధి, రియల్ ఎస్టేట్ సంబంధిత నిర్ణయాలు తీసుకోవాలని పురపాలకశాఖ అధికారులను ఆదేశించారు.
కాలుష్యం కోరల్లో పడొద్దు
హైదరాబాద్ చుట్టుపకల ఉన్న లక్ష ఎకరాల అటవీ భూమిని రక్షించి పచ్చదనాన్ని పెంచడానికి చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా అధికారులు జీవో 111పై హైకోర్టులో వ్యాజ్యం నడుస్తున్న విషయాన్ని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. మహానగరం వైశాల్యమంత ఉన్న 111 జీవో పరిధిలోని ప్రాంతాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధిచేయకుంటే జలాశయాలు, జనావాసాలు కాలుష్యం బారినపడే ప్రమాదం ఉన్నదని సీఎం అన్నారు.
అలాంటి పరిస్థితి రాకుండా ఇప్పటినుంచే సమగ్ర ప్రణాళికలతో గ్రీన్ జోన్లు, సీవరేజ్ మాస్టర్ ప్లాన్, తాగునీటి వ్యవస్థ, విశాలమైన రోడ్డు సదుపాయాలు కల్పించాలని సూచించారు. రాబోయే తరాలకు మంచి నగరాన్ని ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అస్తవ్యస్తంగా అభివృద్ధి చెందితే జలాశయాలు కాలుష్యపూరితమై హైదరాబాద్ నగరాన్ని కూడా ప్రభావితం చేస్తాయని తెలిపారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని జీవో 111పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి సమయం పడుతుంది కాబట్టి, హైకోర్టును ఇంకొంత వ్యవధి కోరాలని సమావేశంలో నిర్ణయించారు.