Gadwal | జోగులాంబ గద్వాల : ఆర్టీసీ బస్సుల్లేక విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సకాలంలో పాఠశాలలకు చేరుకునేందుకు ప్రయివేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. కొంత మంది విద్యార్థులైతే ట్రాక్టర్లో స్కూల్కు బయల్దేరారు. ఈ ఘటన అలంపూర్ నియోజకవర్గంలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. రాజోలి మండల పరిధిలోని మాన్దొడ్డి గ్రామంలో ఉన్న జడ్పీహెచ్ఎస్ పాఠశాలకు సమీప గ్రామాల నుంచి విద్యార్థులు తరలివస్తుంటారు. పచ్చర్ల గ్రామం నుంచి విద్యార్థులు రోజు ఆర్టీసీ బస్సులో పాఠశాలకు వెళ్తుంటారు. అయితే గత నాలుగైదు రోజుల నుంచి బస్సు సరిగ్గా రావడం లేదు. ఉదయం 11:40 అయినా కూడా ఆర్టీసీ బస్సు రాకపోవడంతో చివరకు ట్రాక్టర్లో ఎక్కి పాఠశాలకు వెళ్లారు విద్యార్థులు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమయానికి ఆర్టీసీ బస్సులు నడపాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.