హైదరాబాద్ : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు సంస్థ అన్ని చర్యలు తీసుకుంటుందని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ (RTC MD Sajjanar) తెలిపారు. ఇందులో భాగంగా రేపటి (శుక్రవారం) నుంచి జీరో టికెట్లను జారీ చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి ప్రయాణికురాలు విధిగా జీరో టికెట్(Zero Tickets) ను తీసుకుని సంస్థకు సహకరించాలని కోరారు.
మహిళలకు జీరో టికెట్ల జారీపై క్షేత్ర స్థాయి అధికారులతో గురువారం సజ్జనర్ వర్చువల్ గా సమావేశాన్ని నిర్వహించారు. ‘ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యానికి మహిళ నుంచి మంచి స్పందన వస్తోంది. ఎలాంటి ఫిర్యాదులు రాకుండా ప్రశాంతంగా పథకం అమలవుతోంది. పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు సాఫ్ట్వేర్ను సంస్థ అప్ డేట్ చేసిందని’ వివరించారు.
సాఫ్ట్వేర్ను టిమ్ మెషిన్లలో ఇన్స్టాల్ చేస్తున్నామని, మెషిన్ల ద్వారా శుక్రవారం నుంచి జీరో టికెట్లను సంస్థ జారీ చేస్తుందన్నారు. మహిళా ప్రయాణికులు తమ వెంట ఆధార్, ఓటరు, తదితర గుర్తింపు కార్డులను తెచ్చుకోవాలని సూచించారు. స్థానికత ధృవీకరణ కోసం వాటిని కండక్టర్లకు చూపించి విధిగా జీరో టికెట్లను తీసుకోవాలని కోరారు.