హైదరాబాద్, జూలై 15 (నమస్తేతెలంగాణ): యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్)లో కొన్ని ప్లాంట్ల వ్రైవేటీకరణ టెండర్ల గడువును టీజీ జెన్కో మరోసారి పొడిగించింది. టెండర్ల దాఖలుకు ఈ నెల 24 వరకు అవకాశం కల్పించింది. మంగళవారంతో టెండర్ల గడువు ముగియగా, మూడు సంస్థలు మాత్రమే టెండర్లు దాఖలు చేసినట్టు సమాచారం. మొదట జూన్ 29, జూలై 14 వరకు టెండర్ల దాఖలుకు అవకాశం ఇచ్చారు. తాజాగా దానిని ఈ నెల 24 వరకు పొడిగించారు.
యాదాద్రి పవర్ ప్లాంట్లోని యాష్ హ్యాండ్లింగ్, కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ల ప్రైవేటీకరణకు జెన్కో టెండర్లు ఆహ్వానించిన విషయం తెలిసిందే. వైటీపీఎస్ ప్రైవేటీకరణను విద్యుత్తు ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. బుధవారం రాష్ట్రంలోని అన్ని విద్యుదుత్పత్తి ప్లాంట్లతోపాటు, హైదరాబాద్లోని విద్యుత్తు సౌధలో మధ్యాహ్న భోజన సమయంలో ఉద్యోగులు నిరసనలకు దిగారు. వైటీపీఎస్ టెండర్లను రద్దుచేసే వరకూ ఉద్యమిస్తామని జేఏసీ నేతలు ప్రకటించారు.