హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): కాకినాడలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కారులో అనుమానాస్పదంగా యువకుడి మృతదేహం లభించడం కలకలం రేపింది. ఆ యువకుడిని గతంలో అనంతబాబు వద్ద డ్రైవర్గా పనిచేసిన సుబ్రమణ్యంగా గుర్తించారు. అతడిని గురువారం రాత్రి అనంతబాబు తీసుకెళ్లాడని, అర్ధరాత్రి రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడంటూ ఎమ్మెల్సీ కారులో మృతదేహాన్ని తీసుకొచ్చారని కుటుంబీకులు ఆరోపించారు. సుబ్రమణ్యంను హత్య చేశారంటూ వారు ఆందోళనకు దిగడంతో అనంతబాబు కారు వదిలి వెళ్లిపోయారు. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు పోలీసులు రావడంతో సుబ్రమణ్యం కుటుంబీకులు అంబులెన్స్ను అడ్డుకొన్నారు. అనంతబాబును అరెస్టు చేయాలంటూ నినాదాలు చేశారు. అనంతబాబుకు సన్నిహితమైన మహిళతో సుబ్రహ్మణ్యంకు వివాహేతర సంబంధం ఉండటం వల్లే అతడిని తీవ్రంగా కొట్టి హత్య చేసినట్టు ప్రచారం జరుగుతున్నది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.