YS Sharmila | హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): తన కుమారుడి వివాహానికి ఆహ్వానించేందుకు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల బుధవారం ఏపీ సీఎం, తన సోదరుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసానికి వెళ్లారు. ఆమె వెంట భర్త అనిల్, తల్లి విజయమ్మ, కుమారుడు వైఎస్ రాజారెడ్డి కూడా ఉన్నారు. తన ఇంట్లో జరుగనున్న తొలి శుభకార్యానికి హాజరుకావాలని వారు జగన్ దంపతులను కోరా రు. సోదరుడితో విభేదాలు ఏర్పడినట్టు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ నుంచి దూరమైన షర్మిల తెలంగాణలో వైఎస్సార్టీపీ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. చాలాకాలం తరువాత సోదరుడిని షర్మిల కలుసుకోవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. విమానాశ్రయం వద్ద షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. ‘పెళ్లి కదా! బ్రో కి చెప్పటానికి వచ్చాను’ అని అన్నారు. అక్కడి నుంచి ఆమె నేరుగా ఢిల్లీ వెళ్లారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు ఇదివరకే వెల్లడించిన షర్మిల గురువారం ఢిల్లీలో పార్టీ పెద్దల సమక్షంలో కండువా కప్పుకోనున్నట్టు తెలిసింది. షర్మిలతోపాటు జగన్ ఇంటికి వెళ్లిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) తాను కూడా కాంగ్రెస్లో చేరనున్నట్టు ప్రకటించారు.
నేడు కేసీఆర్కు జగన్ పరామర్శ
ఇటీవల గాయపడి కోలుకుంటున్న బీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్రావును ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించనున్నారు. హైదరాబాద్కు గురువారం రానున్న జగన్ నేరుగా కేసీఆర్ ఇంటికి వెళ్లనున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల అనంతరం కేసీఆర్ గాయపడిన సంగతి తెలిసిందే. తుంటి ఎముక శస్త్రచికిత్స అనంతరం ఆయన కోలుకుంటున్నారు.