హుస్నాబాద్, డిసెంబర్ 5 : తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన, అవమానించిన కుటుంబాలకు చెందిన వారు ఇప్పుడు ఇక్కడ పాదయాత్రలు చేయడం హాస్యాస్పదంగా ఉన్నదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. ఎవరో వదిలిన బాణాలు ఇక్కడికొచ్చి.. తెలంగాణ కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడిన సీఎం కేసీఆర్పై విమర్శలు చేయడం బాధాకరమన్నారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి తెలంగాణ ఉద్యమాన్ని, నాయకులను ఎంత హేళనచేసి మాట్లాడారో ప్రజలు మర్చిపోలేదని చెప్పారు. సోమవా రం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో రూ.12.50 కోట్లతో నిర్మించనున్న మాతాశిశు ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణం, ఫైర్స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి, డయాలసిస్ సెంటర్ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలు శిఖండి రాజకీయాలు చేస్తున్నాయని, వీటిని ప్రజలు నమ్మొద్దని కోరారు. 11 రోజులు అన్నం ముద్ద ముట్టకుండా ప్రాణాలు ఇచ్చేందుకు సిద్ధపడి తెలంగాణ తెచ్చిన కేసీఆర్కు ఈ రాష్ట్రంపై ప్రేమ ఉంటుంది గానీ, గుజరాత్కు చెందిన నరేంద్రమోదీకి, ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన రెండు కండ్ల సిద్ధాంతానికి, ఎవరో వదిలిన బాణాలకు ప్రేమ ఉంటుందా? అనేది ప్రజలు గమనించాలని సూచించారు. బీజేపీ లాంటి ఎన్ని రాజకీయ పార్టీలు అడ్డొచ్చినా త్వరలోనే గౌరవెల్లి రిజర్వాయర్ను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ రాకముందు మూడు డయాలసిస్ సెంటర్లు మాత్రమే ఉండేవని, ఒకటి వరంగల్లో ఉంటే రెండు హైదరాబాద్లో ఉండేవన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక 102 డయాలసిస్ సెంటర్లు కిడ్నీ రోగులకు వైద్య చికిత్సలు అందిస్తున్నాయని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్, జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పాల్గొన్నారు.