నాంపల్లి కోర్టులు, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): సిట్ కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించిన తరుణంలో పోలీసు అధికారులపై దాడికి పాల్పడిన కేసులో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు బెయిల్ మంజూరైంది. సోమవారం హైడ్రామా మధ్య ఆమెను అరెస్టు చేసి పోలీసులు కోర్టులో హాజరుపర్చగా, న్యాయమూర్తి రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. మంగళవారం ఇరుపక్షాల వాదనలు విన్న 3వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సీ విక్రమ్ షరతులతో కూడిన బెయిల్ను షర్మిలకు మంజూరు చేశారు. రూ.30 వేల పూచీకత్తుతో న్యాయస్థానానికి ఇద్దరు ష్యూరిటీ సమర్పించాలని తెలిపారు. కేసు దర్యాప్తులో నిందితురాలు పోలీసులకు సహకరించాలని, దేశం విడిచి వెళ్లకూదడని, సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించరాదని ఉత్తర్వులో పొందపర్చారు. ఈ కేసు తరహా మరో కేసు నమోదు కాకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుందని కోర్టు తెలిపింది. లేని పక్షంలో బెయిల్ రద్దవుతుందని పేర్కొన్నారు. షర్మిల కారు డ్రైవర్ చిన్నకోట్ల బాబు (ఏ2) దవాఖానలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో రిమాండ్కు తరలించలేదు.