హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా మరో రెండేండ్లు పొడిగించాలన్న ఏపీ వైసీపీ నేతలపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇన్ని రోజులు ఏం చేశారని ప్రశ్నించారు. గురువారం ఆమె విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ ఐదేండ్లు అధికారమిస్తే విభజన హామీల్లో ఒక్కటంటే ఒక్కదానిని కూడా నెరవేర్చలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ర్టానికి రాజధాని లేదని, ప్రత్యేక హోదా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఐదేండ్లలో రాష్ర్టానికి కొత్త పరిశ్రమలు రాలేదని, ఉన్నవి కూడా ఉంటాయో? లేదో? తెలియదని అనుమానం వ్యక్తం చేశారు. రూ. 8 లక్షల కోట్లు అప్పుచేసి రాష్ర్టాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారు తప్పితే, అభివృద్ధి చేయలేదని ధ్వజమెత్తారు. అమరావతి పేరుతో చంద్రబాబు త్రీడీ గ్రాఫిక్స్ చూపిస్తే, మూడు రాజధానుల పేరుతో జగనన్న మూడుముక్కలాట ఆడారని షర్మిల ఎద్దేవా చేశారు.