హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): చంద్రబాబు లాంటి వ్యక్తి ప్రజల్లో ఉన్నా.. జైల్లో ఉన్నా పెద్ద తేడా ఉండబోదని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సోమవారం జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో జగన్ తొలిసారిగా చంద్రబాబు అరెస్ట్పై స్పందించారు. చంద్రబాబుకు విశ్వసనీయత అనేది లేదని, అలాంటి వ్యక్తిని అరెస్టు చేయించాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు. బాబు అరెస్టు వెనుక రాజకీయ కుట్ర, ప్రతీకార చర్య ఉన్నదంటూ ఎల్లో మీడియా ప్రచారం చేస్తున్నదని ఆరోపించారు. చంద్రబాబును, ఆయన పార్టీని చూసినప్పుడు ప్రజలకు మోసాలు, వెన్నుపోట్లు, అబద్ధాలు, వంచనలు గుర్తుకొస్తాయని, అలాంటి వ్యక్తిని ఎవరూ కక్షసాధింపుతో అరెస్టు చేయలేరని అన్నారు. ఆయన మీద తనకు ఎలాంటి కక్ష లేదని తెలిపారు. తాను లండన్లో ఉన్నపుడు చంద్రబాబును పోలీసులు అరెస్టు చేశారని, ఆ ఆరెస్ట్తోనూ ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు.