సంగారెడ్డి : తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం స్నేహితులతో కలిసి తన పుట్టినరోజు నాడు ఓ యువకుడు రక్తదానం చేశాడు. ఈ ఘటన సంగారెడ్డిలో ఆదివారం చోటుచేసుకుంది. సలపాల అఖిల్ గౌడ్(23) అనే యువకుడు తన స్కూల్ టీచర్ పైసా సత్యం సూచన మేరకు గడిచిన మూడు నెలలక్రితం మొదటిసారిగా రక్తందానం చేశాడు. తన బ్లడ్ గ్రూప్(A+) ఏంటో మొదటిసారిగా అతనికి తెలిసింది అప్పుడే. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి రక్తదానం చేయడంలో ఉన్న సంతృప్తి అప్పుడే తనకు తెలిసిందని అఖిల్ తెలిపాడు.
ఈ కరోనా సంక్షోభంలో రక్తం కొరత ఏర్పడుతుందని కావునా తన వంతుగా 13 మంది స్నేహితులతో కలిసి తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం రక్తదానం చేసినట్లు చెప్పాడు. తన పుట్టినరోజును ప్రత్యేకంగా నిలుపుకునేందుకు స్నేహితులతో కలిసి హైదరాబాద్ రాజేంద్రనగర్లోని తలసేమియా సికిల్ సెల్ సొసైటీకి వెళ్లి రక్తదానం చేసినట్లు వెల్లడించాడు. ఇకపై ప్రతీ పుట్టినరోజున బందువులు, స్నేహితులతో కలసి రక్తదానం చేయనున్నట్లు పేర్కొన్నాడు.