హైదరాబాద్: డ్రగ్స్ డిమాండ్ను తగ్గిస్తే సరఫరాను అడ్డుకోవచ్చని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అన్నారు. డ్రగ్స్ వినియోగదారుల్లో యువకులు, ఉద్యోగులు అధికంగా ఉంటున్నారని చెప్పారు. టాస్క్స్ ఫోర్స్ పోలీసులు హైదరాబాద్లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. ఈ సదర్భంగా నిందితులను సీపీ ఆనంద్ మీడియా మందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మూడు బృందాలకు చెందిన ఏడుగురిని అరెస్టు చేశామని తెలిపారు. వారివద్ద 99 గ్రాముల కొకైన్, 45 గ్రాముల ఎండీఎంఏ, 17 ఎస్ఎస్డీఈ, 27 ఎక్స్టాసీ ట్యాబ్లెట్లు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. వాటి విలువ సుమారు రూ.16 లక్షలు ఉంటుందని చెప్పారు.
నైజీరియాకు చెందిన టోనీ డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని సీపీ వెల్లడించారు. ఏజెంట్లను నియమించుకుని రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారని తెలిపారు. డ్రగ్స్ తీసుకుంటున్నవారి జాబితా సేకరిస్తున్నామన్నారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో ఆరుగురిని గుర్తించామని చెప్పారు. అవసరమైతే వారిని చట్ట ప్రకారం అరెస్టు చేస్తామన్నారు.