షాబాద్, జనవరి 27: డబ్బు ముందు బంధం, బంధుత్వం, రక్తసంబంధం తేలిపోతున్నది. ఆస్తులపై ఉన్న అత్యాశ ఆత్మబంధువులను సైతం హతమారుస్తున్నది. ఆస్తి కోసం సొంత అక్కను హతమార్చేందుకు సుపారీ ఇచ్చింది ఓ చెల్లి. ఆ చెల్లి పంపించిన కిరాయి గూండాల దాడి నుంచి తృటిలో తప్పించుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా షాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. షాబాద్ సీఐ అశోక్కుమార్ గురువారం కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. ఏపీకి చెందిన తాటికొండ పుష్పమణి, సింధూర అక్కాచెల్లెళ్లు. వీరికి విజయవాడలో సుమారు రూ. 2 కోట్ల విలువైన అరెకరం (20 గుంటల) భూమి ఉన్నది. ఈ భూమి పంపకం లావాదేవీల్లో అక్కాచెల్లెళ్లకు వివాదాలు ఏర్పడ్డాయి. భూతగాదాల కారణంగా అక్కపై కోపం పెంచుకున్న చెల్లెలు సింధూర.. తన భర్త శ్రీనాథ్తో కలిసి అక్కను చంపేందుకు ప్లాన్చేసింది. హైదరాబాద్లోని బండి శ్రీకాంత్గౌడ్ను కలిసి తన అక్క పుష్పమణిని చంపేందుకు రూ. 2 లక్షల నగదు, సఫారీ కారు ఇచ్చింది. శ్రీకాంత్గౌడ్ హైదరాబాద్కు చెందిన మరో ఐదుగురు భానుకిరణ్, సాయికిరణ్, వినోద్కుమార్, బ్రహ్మచారి, సాయికుమార్లను పిలిపించుకున్నాడు. హైదరాబాద్లోని మాదాపూర్లో పుష్పమణి నివాసం ఉంటున్నది. వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం మిట్టకంకల్ వద్ద వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి అక్కడ ఫాంహౌస్ నిర్మిస్తున్నది. తరచూ అక్కడకు వస్తూ ఉండేది. ఇదే అవకాశంగా భావించిన దుండగులు.. ఈ నెల 24న ఆ ఫౌంహౌస్ సమీపంలో కారులో మాటువేశారు. సాయంత్రం స్నేహితుడు రాజేశ్కుమార్తో కలిసి పుష్పమణి తన కారులో ఫాంహౌస్ నుంచి తిరిగి నగరానికి వస్తుండగా.. నిందితులు వారిపై దాడికి యత్నించారు. నిందితులు ఎంత ప్రయత్నించినా కారు డోర్లాకులు తెరుచుకోలేదు. కారు అద్దాలను పగులగొట్టి, చంపేందుకు ప్రయత్నిస్తుండగా.. కారును రివర్స్ తీసుకొని షాబాద్ పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. గురువారం ఐదుగురిని అరెస్టు చేశారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి రూ.1.94 లక్షల నగదు, నాలుగు సెల్ఫోన్లు, బీరు సీసాలు, కారును స్వాధీనం చేసుకున్నారు.