Yadadri | తాగిన మైకంలో అన్నను ఇనుప రెంచ్(పాన)తో తలపై కొట్టి హతమార్చిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం రామారంలో సోమవారం రాత్రి జరిగింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మరిపెల్లి నర్సయ్య (58) గతంలో జీవనోపాధి నిమిత్తం భార్య, కొడుకుతో కలిసి చెన్నైలో ఉండేవాడు. కరోనా కారణంగా నర్సయ్య తిరిగి గ్రామంలోనే కూలి చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. భార్య అంజమ్మ, కొడుకు వెంకటేశ్ చెన్నైలోనే ఉంటున్నారు. మృతుడు నర్సయ్య తమ్ముడు మరిపెల్లి సాయికిరణ్ మద్యానికి బానిస కావడంతో అతని భార్య ధనలక్ష్మి తన ఇద్దరు పిల్లలతో మొండ్రాయి గ్రామంలో తన పుట్టింట్లో ఉంటుంది.
సోమవారం రాత్రి సాయికిరణ్, మృతుడు నర్సయ్య కలిసి మద్యం సేవించారు. క్రమంలో తాగిన మైకంలో సాయికిరణ్ తన అన్న నర్సయ్యపై ఇనుప పానతో తలపై బలంగా కొట్టడంతో నర్సయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. విషయాన్ని గమనించిన గ్రామస్తుడు మరిపెల్లి కృష్ణ విగతజీవిగా ఉన్న నర్సయ్యను, రక్తపు మరకలతో ఉన్న సాయికిరణ్ను చూసి పోలీసులకు సమాచారం అందించాడు. మృతుడు నర్సయ్య కూతూరు ఎలిమినేటి జానకి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ యాకన్న తెలిపారు.