Telangana | సిర్పూర్(టీ), సెప్టెంబర్ 19: ప్రేమను నిరాకరించిందన్న కోపం.. తనకు దక్కనిది మరెవరికీ దక్కకూడదన్న కక్షతో ఓ యువకుడు యువతిని హత్య చేసిన ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టీ) మండలం వెంకట్రావ్పేట్లో చోటుచేసుకుంది. సిర్పూర్(టీ) పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకట్రావ్పేట్కు చెందిన దంద్రే కమలాకర్ (28)కు పెండ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అదే గ్రామానికి చెందిన బుడే దీప (19)ను ప్రేమ పేరిట వేధిస్తున్నాడు. దీప అతడి ప్రేమ ను నిరాకరించింది. అయినా.. వినకుండా తనతోనే మాట్లాడాలని, తనతో కాకుండా ఎవరితో మాట్లాడినా చంపుతానని బెదిరించేవా డు. నిత్యం వాట్సాప్లలో అసభ్యకరమైన మెసేజ్లు పింపించేవాడు. పరువుపోతుందేమోనని దీప ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు.
ఈ క్ర మంలో ఈ నెల 17న సా యంత్రం కమలాకర్ దీప ఇంటికి వచ్చాడు. అప్పటికే ఆమె ఇంట్లో చిన్న పిల్లలు ఉండగా బయటికి పంపించాడు. ఇంట్లో ఉన్న పురుగుల మందును ఆమెకు బలవంతంగా తాగించి పారిపోయాడు. దీప బయటకు వచ్చి కేకలు వేయగా.. స్థానికులు ద్విచక్రవాహనంపై సిర్పూర్(టీ) దవాఖానకు తరలించారు. అనంతరం కాగజ్నగర్లోని ఓ ప్రైవేటు దవాఖానకు, అక్కడి నుంచి కరీంనగర్లోని ఓ ప్రైవేటు దవాఖానకు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ సోమవారం మరణించింది. కమలాకర్ను అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్టు కౌటల సీఐ సాధిక్ పాషా, సిర్పూర్(టీ) ఎస్సై దీకొండ రమేశ్ తెలిపారు.