కట్టంగూర్, జూలై 18: డాక్టరై సమాజానికి సేవ చేయాలన్న ఆశయంతో అడుగులు వేసిన ఓ వైద్య విద్యార్థిని ప్రేమపేరుతో ఓ యుకుకుడి వేధింపులకు తాళలేక బలవన్మరణానికి పాల్పడింది. వేధింపులకు కారణమైన యువకుడు సైతం భయంతో ప్రాణాలు తీసుకున్న ఘటన నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం మునుకుంట్లలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మునుకుంట్లకు చెందిన సుక్క లింగయ్య-యాదమ్మ చిన్న కూతురు లక్ష్మీప్రసన్న(21) సూర్యాపేట ప్రభుత్వ వైద్యకళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నది. అదే గ్రామానికి చెందిన చిలుముల రామ్చరణ్ (25) కొంతకాలంగా ప్రేమిస్తున్నానంటూ ఆమెను వేధింపులకు గురిచేశాడు. పలుమార్లు లక్ష్మీప్రసన్న కుటుంబసభ్యులు రామ్చరణ్ను మందలించినా అతడిలో మార్పురాలేదు. చరణ్ వేధింపులను తట్టుకోలేక తీవ్ర మనోవేదనకు గురైన లక్ష్మీప్రసన్న శుక్రవారం సాయంత్రం తన ఇంట్లో ఉరేసుకున్నది.
తనవల్లే లక్ష్మీప్రసన్న ఆత్మహత్య చేసుకున్నదని భయాందోళనకు గురైన రాంచరణ్ అదేరోజు రాత్రి గ్రామశివారులోని తన వ్యవసాయ భూమి వద్దకు వెళ్లాడు. ఐదేండ్ల క్రితం మరణించిన తన తండ్రి నర్సింహ సమాధిపై రక్తంతో తనతోపాటు ‘చిన్నారి’ అనే పేర్లు రాసి, పక్కనే ఉన్న చెట్టుకు ఉరివేసుకుని ప్రాణం తీసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అదేరోజు రాత్రి లక్ష్మీప్రసన్న మృతదేహానికి శనివారం చరణ్ మృతదేహానికి పంచనామా నిర్వహించారు. శాలిగౌరారం సీఐ రాజశేఖర్, కట్టంగూర్ ఎస్సై మునుగోటి రవీందర్ ఆధ్వర్యంలో గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. మృతురాలి అక్క లక్ష్మీప్రియాంక, రామ్చరణ్ తల్లి జానకమ్మ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పేర్కొన్నారు.