కాంగ్రెస్ హయాంలో నీటి చుక్క లేక నెర్రెలు బారిన నేల తుంగతుర్తి. నాలుగు వందల ఫీట్ల లోతు బోర్లు వేసినా నీటి జాడ లేని నియోజకవర్గమిది. సాగునీటికే కాదు తాగునీటికి కూడా దశాబ్దాల తరబడి గోసపడ్డ ప్రాంతమిది. గుంతలు తేలిన సింగిల్ రోడ్లు, అరకొర మౌలిక సదుపాయాలతో అన్ని రంగాల్లోనూ ఈ నియోజకవర్గాన్ని వెనక్కు నెట్టేశారు నాటి పాలకులు.
2014లో రాష్ట్రంలో కేసీఆర్ పాలన రావడం, బీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిశోర్ ఎమ్మెల్యేగా గెలవడంతో తుంగతుర్తిలో అభివృద్ధి మొదలయ్యింది. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో నియోజకవర్గ రూపురేఖలే మారిపోయాయి. ఒకనాడు కరువు తాండవించిన ఈ నేలపై ఇప్పుడు రికార్డు స్థాయిలో వరి సాగు అయితున్నది. అన్ని రంగాల అభివృద్ధిలో ఇప్పుడు తుంగతుర్తి నెంబర్ వన్గా నిలుస్తున్నది.
వీరోచిత సాయుధ రైతాంగ పోరాటం చేసిన చైతన్యం తుంగతుర్తి ప్రాంతానిది. అయితే, దశాబ్దాల పాటు ఏలిన నాయకులు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధికి దూరం చేశారు. ఇక్కడ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కాంగ్రెస్ నేత రాంరెడ్డి దామోదర్రెడ్డి రెండుసార్లు మంత్రిగా పని చేశారు. కానీ, అభివృద్ధిని మాత్రం ఆయన విస్మరించారు. రెండుసార్లు గెలిచిన సంకినేని వెంకటేశ్వరరావు, మోత్కుపల్లి నర్సింహులు హయాంలోనూ నియోజకవర్గం ఏమాత్రం అభివృద్ధి చెందలేదు. కేసీఆర్ పాలన మొదలైన తర్వాత కేవలం పదేండ్లలోనే తుంగతుర్తిలో అరవై ఏండ్లలో జరిగిన అభివృద్ధి కంటే అనేక రెట్లు ఎక్కువ జరిగింది. ఈ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం ఈ పదేండ్లలో దాదాపుగా రూ.6,000 కోట్లు ఖర్చు చేసింది. జరిగిన అభివృద్ధిని చూసే ప్రజలు రెండోసారి 2018లో గాదరి కిశోర్ను గెలిపించారు.
కేసీఆర్ ప్రభుత్వం తుంగతుర్తిలో కరువును తరిమికొట్టింది. రూ.18 కోట్లతో ఎస్సారెస్పీ కాల్వల ఆధునీకరణ చేసి కాళేశ్వరం జలాలు తీసుకువచ్చింది. దీంతో ఇప్పుడు ఇక్కడి ప్రతి పల్లెలు పచ్చని మాగాణంగా మారాయి. నెర్రెలు బారిన భూముల్లో సిరులు పండుతున్నాయి. మిషన్ కాకతీయతో 450 చెరువులకు పూర్వ వైభవం వచ్చింది. చెరువులు, కుంటలన్నీ నిండుకుండల్లా జలకళను సంతరించుకున్నాయి. రూ.59 కోట్లతో 6 చెక్డ్యాంలు నిర్మించారు. రూ.7.50 కోట్లతో శాలిగౌరారం ప్రాజెక్టుకు మరమ్మతులు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడకముందు నియోజకవర్గంలో ఎన్నడూ 17 వేల ఎకరాలకు మించి వరి సాగు జరగలేదు. నేడు 1,12,210 ఎకరాలు వరి సాగు అవుతున్నది. ఒకప్పుడు తిండి గింజలు దొరకని ప్రాంతంలో నేడు రెండు పంటలకు సరిపడా నీరు అందుతుండటంతో 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తున్నది.
గతంలో తుంగతుర్తిలో ఎమ్మెల్యేలుగా పని చేసిన పేరుకు పెద్ద నాయకులు చేయలేని అభివృద్ధి పనులను గాదరి కిశోర్ ఈ పదేండ్లలోనే చేసి చూపించారు. తిరుమలగిరి, మోత్కూర్ను మున్సిపాలిటీలుగా మార్చారు. నియోజకవర్గవ్యాప్తంగా రూ.232 కోట్లతో బీటీ రోడ్లు నిర్మించారు. తిరుమలగిరి మున్సిపాలిటీలో రూ.5 కోట్లతో పురపాలక భవనం, రూ.2 కోట్లతో సమీకృత మార్కెట్, రూ.30 కోట్లతో మంచినీటి ట్యాంక్, పైపులైన్ నిర్మాణం, రూ.3 కోట్లతో ఆడిటోరియం, రూ.2 కోట్లతో డంపింగ్ యార్డు, రూ.3 కోట్లతో సీసీ రోడ్లు, రూ.5 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, రూ.2 కోట్లతో బతుకమ్మ ఘాట్, కమ్యూనిటీ హాల్, సెంట్రల్ లైటింగ్ సిస్టంను ఏర్పాటు చేశారు.
రూ.5.16 కోట్లతో గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం, రూ.6 కోట్లతో వసతి గృహాలు ఏర్పాటు చేశారు. అర్వపల్లిలో రూ.5 కోట్లతో యోగానంద లక్ష్మీనర్సింహస్వామి ఆలయ పునర్నిర్మాణం, రూ.1.55 కోట్లతో సబ్ మార్కెట్ యార్డు, రూ.3 కోట్లతో తుంగతుర్తిలో మార్కెట్ యార్డు నిర్మించారు. రూ.4.80 కోట్లతో మోత్కూర్లో మినీ ట్యాంక్బండ్ను అభివృద్ధి చేశారు. రూ.18 కోట్లతో గురజాల -మానాయికుంటపై బ్రిడ్జి నిర్మించారు. రూ.43 కోట్లతో మద్దిరాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంజూరు చేయించారు.