హైదరాబాద్ : రాష్ట్ర ప్రణాళిక శాఖను క్షేత్ర స్థాయిలో మరింత బలోపేతం చేయడమే కాకుండా రాష్ట్ర సమగ్ర అభివృద్ధిలో క్రియాశీల పాత్రను పోషించేందుకు కాకతీయ గవర్నెన్స్ ఫెలోస్ పేరిట యువ ( యంగ్ ) నిష్ణాతులను ఎంపిక చేశారు. ఈ యంగ్ టీమ్ ను క్షేత్ర స్థాయి కార్యాచరణలో భాగస్వామ్యం చేయనున్నారు. బుధవారం ఎం.సీ.ఆర్.హెచ్.ఆర్.డీ. లో జరిగిన కీలక సమావేశంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, రాష్ట్ర ఆర్ధిక, ప్రణాళికశాఖల ముఖ్య కార్యదర్శి కే. రామకృష్ణారావు, ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రోస్, అర్థ గణాంక శాఖ డైరెక్టర్ దయానంద్, ప్రణాళిక శాఖ డైరెక్టర్ షేక్ మీరా దిశా నిర్దేశం చేశారు.
అమెరికా, కెనడా, లండన్, ఆస్ట్రేలియా సహా దేశంలోని వివిధ రాష్ట్రాలలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీలలో ఎకనామిక్, ఫైనాన్స్, ఐఐటీ, రూరల్ డెవలప్మెంట్, విద్యా, వైద్య రంగాల్లోని మేటి అయిన యంగ్ టీంను ప్రణాళికాశాఖ ఎంపిక చేసింది. ఈ యంగ్ టీంతో బోయినపల్లి వినోద్ కుమార్ బుధవారం ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం చైర్మన్ అయిన సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను ఈ యంగ్ టీమ్ ఎంపిక ద్వారా అధికారులు సిద్ధం చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ యంగ్ టీమ్ రంగంలో దిగనుంది.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుంచి విద్యుత్, నీటి పారుదల, వ్యవసాయం, విద్యా రంగాల్లో విప్లవాత్మక విజయాలు సాధించడమే కాకుండా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుంది. ఈ నేపథ్యంలో యంగ్ స్పెషలిస్ట్ టీమ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయిలో పర్యటించి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ఆయా శాఖల పని తీరుతెన్నులపై సూక్ష్మ స్థాయిలో పరిశీలన చేయనుంది. పరిశీలన అనంతరం ఈ యంగ్ టీమ్ నివేదిక సమర్పించగానే రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని వినోద్ కుమార్ తెలిపారు. రానున్న రోజుల్లో విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వర్చువల్ ద్వారా అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కార్తిక్ మురళీధరన్, సిజేష్ ప్రతినిధులు, వివిధ రాష్ట్రాలకు చెందిన విజయ్ పింగాలే, పారుల్ అగర్వాల్, దేబశిష్, మాతంగి జయరాం, సుమిత్ కౌర్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ” తెలంగాణ రాష్ట్ర వెదర్ అండ్ క్లైమాటోలాజీ పుస్తకాన్ని ” , ” పిడుగుల నుంచి రక్షణ ” సీ.డీ. ను వినోద్ కుమార్ ఆవిష్కరించారు.