హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): టీడీపీ, వైసీపీతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒరిగిందేమీ లేదని బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఆరోపించారు. ఓవైపు అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో తెలంగాణ దూసుకుపోతున్నారని, మరోవైపు రాజధాని విషయంలోనూ ఏపీకి కనీస స్పష్టత లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఏపీలో టీడీపీ, వైసీపీకి బీఆర్ఎస్సే ప్రత్యామ్నాయమని స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, బీజేపీకి చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ టీడీపీ, వైసీపీ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.
విభజన చట్టంలో కేంద్రం ఏపీకి ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చటంలో రెండు పార్టీలు విఫలమయ్యాయని విమర్శించారు. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తున్నదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ విధానాలకు ఆకర్షితులై ఏపీలోని అన్ని పార్టీల నాయకులు చేరుతున్నారని, ఏపీ ప్రజల్లో కేసీఆర్కు విశేష ఆదరణ ఉందని స్పష్టం చేశారు. తోట సుబ్బారావు, జేవీ నాయుడు సారథ్యంలో బీఆర్ఎస్లో చేరిన వారిలో టీడీపీ నుంచి శ్రీకాంత్బాబు, శ్రీనివాసరావు, బీ ఆనంద్బాబు, శ్రీనివాసులు, నెల్లూరు జిల్లాకు చెందిన బీజేపీ నాయకులు వీ ప్రసాద్, కే సురేశ్, వైసీపీకి చెందిన రవీంద్రబాబు, రూపేశ్కుమార్, నాయబ్, శ్రీనివాస్రావు, శంకర్, ప్రసన్నకుమార్రెడ్డి, డీ శ్రీనివాసరెడ్డి, దాస్, కిరణ్, మహేందర్ యాదవ్, రాజా, అరుణ్ కుమార్, మల్లేశ్, గుప్తా తదితరులున్నారు.