హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 24 (నమస్తే తెలంగాణ): మనిషి ఆరోగ్యంపై ఊబకాయం తీవ్ర ప్రభావం చూపుతున్నదని యశోద హాస్పిటల్స్ వైద్యులు వెల్లడించారు. రోజురోజుకు ఊబకాయుల సంఖ్య పెరుగుతున్నదని తెలిపారు. శుక్రవారం సోమాజిగూడ యశోద హాస్పిటల్లో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో హాస్పిటల్స్ గ్రూప్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి, సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ కోన లక్ష్మీకుమారి మాట్లాడారు.
ఈ జబ్బు పిల్లలను కూడా వదలటం లేదని, ముఖ్యం గా కరోనా వల్ల ఇండ్లకే పరిమితం కావటంతో చాలామందిలో ఈ సమస్య మరింత పెరిగిందని డాక్టర్ పవన్ గోరుకంటి తెలిపారు. దీనివల్ల చిన్న వయసులోనే అనేక రోగాలు వస్తున్నాయని వెల్లడించారు. ఊబకాయం వల్ల మధుమేహం, బీపీ, గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుందన్నారు. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, జన్యు సమస్యల వల్ల ఊబకాయం పెరిగి కీళ్లనొప్పులు, వంధ్యత్వం, శ్వాస సమస్యలు కూడా వస్తున్నాయని డాక్టర్ కోన లక్ష్మీకుమారి తెలిపారు. ఈ మధ్య పెద్ద పేగు, రొమ్ము క్యాన్సర్లకు కూడా ఊబకాయం కారణమవుతున్నదని వాపోయారు. వ్యాయా మం, వాకింగ్, సమతుల ఆహారంతో సమస్య నుంచి తప్పించుకోవచ్చని వివరించారు. వ్యాయామం చేయలేనివారు బేరియాట్రిక్ సర్జరీతో ఉపశమనం పొందవచ్చని పేర్కొన్నారు.