హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): బ్లడ్ క్యాన్సర్లకు ఆధునిక చికిత్స కోసం హైటెక్సిటీలోని యశోద హాస్పిటల్ అత్యాధునిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. శనివారం దవాఖానలో దేశంలోనే అతిపెద్ద, అత్యంత అధునాతన ప్రపంచస్థాయి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ (ఎముక మజ్జ మార్పిడి) సెంటర్ను ప్రారంభించింది.
ఈ కార్యక్రమానికి కోల్కతా టాటా మెడికల్ సెంటర్ డైరెక్టర్, పద్మశ్రీ అవార్డుగ్రహీత ప్రొఫెసర్ డాక్టర్ మమెన్ చాందీ, నవీ ముంబై అట్రెక్ట్ హాస్పిటల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ నవీన్ ఖత్రి, డాక్టర్ గణేశ్ జైషెట్వార్ తదితరులు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. క్యాన్సర్ చికిత్సలో భవిష్యత్ తరాల అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ప్రపంచస్థాయి బోన్ మ్యారో, స్టెమ్ సెల్ ప్లాంట్ సెంటర్ను అందుబాటులోకి తీసుకురావడం గర్వకారణమని ప్రొఫెసర్ డాక్టర్ మమెన్ చాందీ తెలిపారు. ప్రపంచస్థాయి వైద్యసదుపాయాలతో కూడిన అత్యాధునిక బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ సెంటర్ను అందుబాటులోకి తెచ్చినట్టు యశోద హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి తెలిపారు.