హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): యాసంగి వరి ధాన్యాన్ని కేంద్రం కచ్చితంగా కొనాల్సిందేనని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు టీఆర్ఎస్ ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. ఇందుకోసం కార్యాచరణ రూపొందించడానికి టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం 21న సోమవారం తెలంగాణభవన్లో నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నిర్ణయించారు. సోమవారం ఉదయం 11.30 గంటలకు జరుగనున్న ఈ సమావేశంలో పలు కీలకమైన అంశాలపై చర్చించనున్నట్టు తెలిసింది. ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులతోపాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ల అధ్యక్షులు, రైతుబంధు సమితుల జిల్లా అధ్యక్షులు తప్పనిసరిగా హాజరుకావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
కేంద్రంపై మరో పోరాటం
రాష్ట్రంలో యాసంగి వరి ధాన్యాన్ని కేంద్రం కచ్చితంగా కొనాలని డిమాండ్ చేస్తూ ధర్నా, ఆందోళన, నిరసన కార్యక్రమాలకు విస్తృతస్థాయి సమావేశంలో రూపకల్పన చేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ పేరొన్నారు. సమావేశం అనంతరం ముఖ్యమంత్రి, మంత్రుల బృందం అదే రోజు ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్ర మంత్రులను, అవసరమైతే ప్రధానిని కలిసి డిమాండ్ చేస్తారు. రాష్ట్రంలో జరిగే ఆందోళన కార్యక్రమాలకు అనుగుణంగా లోక్సభ, రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీలు నిరసన కార్యక్రమాలు చేపడతారు.
పంజాబ్కో నీతి.. తెలంగాణకో నీతా?
కేంద్రం పంజాబ్ నుంచి వరి ధాన్యాన్ని వంద శాతం సేకరిస్తున్నదని, తెలంగాణ వరి ధాన్యాన్ని కూడా 100 శాతం ఎఫ్సీఐ సేకరించాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. వరి ధాన్యం కొనుగోలుపై ఈ దఫా ఉద్ధృతమైన పోరాటాలకు టీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతున్నందున ఈ సమావేశానికి ఆహ్వానితులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని సీఎం స్పష్టంచేశారు.