యాదగిరిగుట్ట, మార్చి1: ఈ నెల 3న సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయాన్ని మూసివేస్తున్నట్టు ఆలయ ఈవో భవానీశంకర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. చంద్రగ్రహణం కారణంగా ప్రధానాలయంతో పాటు ఉపాలయాలు, అనుబంధ దేవాలయాలలో ఉదయం 7 గంటలలోపు సుప్రభాత, నిజాభిషేకం, అర్చనలు ముగించి మూసివేస్తామని వెల్లడించారు.
4వ తేదీన ఉదయం 3 నుంచి 5.30 గంటల వరకు ప్రధానాలయంతో పాటు ఉపాలయాలను తెరిచి గ్రహణ దోష పరిహారార్థం సంప్రోక్షణ, ఆలయ శుద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. అనంతరం సుప్రభాతం, తిరువారాధన, బాలబోగం, ఆరగింపు, నిజాభిషేకం నిర్వహించి, ఉదయం 8.45 గంటలకు ఉభయ దర్శనాలను ప్రారంభిస్తామని చెప్పారు. చంద్రగ్రహణం సందర్భంగా స్వామివారి సన్నిధిలో రేపు జరిగే హోలికోత్సవాన్ని సోమవారం సాయంత్రం నిర్వహిస్తామని ప్రకటించారు.