యాదాద్రి, సెప్టెంబర్ 18 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి దివ్యక్షేత్రంలో ఆదివారం భక్తుల సందడి నెలకొన్నది. సెలవు రోజు కావడంతో స్వయంభూ నారసింహుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కొండపైన క్యూ కాంప్లెక్స్, ప్రసాద విక్రయశాల కిటకిటలాడాయి.
స్వామివారి వీఐపీ దర్శనానికి గంట, ధర్మదర్శనానికి 2 గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. ఉదయం నుంచి రాత్రి వరకు దర్శనాలు నిరాటంకంగా కొనసాగాయి. 25,219 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, అన్ని విభాగాలు కలుపుకొని రూ.39,44,918 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు.