యాదాద్రి, ఆగస్టు 9: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంతోపాటు పాతగుట్టలో మంగళవారం మహా పూర్ణాహుతి, పవిత్రమాలధారణలతో అర్చకులు పవిత్రోత్సవాలకు పరిసమాప్తి పలికారు. ఉత్సవమూర్తులను నవ కలశాలతో స్నపన తిరుమంజనం జరిపి దివ్య మనోహరంగా అలంకరించారు. యాగశాలలో స్వామి, అమ్మవార్లను అధిష్ఠింపజేసి పంచసూక్త, మూలమంత్ర హోమ పూజలు, మహాపూర్ణాహుతి పర్వాలను నిర్వహించారు. వేడుకల్లో భాగంగా మంగళవారం భక్తులు భారీగా తరలివచ్చారు. దర్శనానంతరం స్వామివారి ప్రసాదాన్ని కొనుగోలు చేసేందుకు ప్రసాద విక్రయశాలలో క్యూ కట్టారు. స్వామివారి ఖజానాకు రూ.20,43,083 ఆదాయం సమకూరిందని ఈవో గీత తెలిపారు.