యాదాద్రి భువనగిరి : ఆనాడు శ్రీ కృష్ణ దేవరయాలు అద్భుత రీతిలో ఆలయాల నిర్మాణాలు చేపట్టారు. ఈనాడు అదే తరహాలో సీఎం కేసీఆర్ అత్యద్భుతంగా యాదాద్రి పునర్నిర్మాణం చేపట్టారని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేయగా, ఆలయ ఏఈఓ శ్రవణ్ కుమార్ లడ్డూ ప్రసాదం అందజేశారు.
అనంతరం ఆలయ నిర్మాణ పనులను ప్రతాప్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. యాదాద్రి పునర్నిర్మాణం ఒక అద్భుతం అని అన్నారు. సీఎం కేసీఆర్ అన్ని మతాలను గౌరవిస్తారని పేర్కొన్నారు. పేదరికంలేని తెలంగాణే ఆయన లక్ష్యమన్నారు. దేశ రాజకీయాల్లో కూడా కేసీఆర్ క్రియాశీలక పాత్ర పోషించనున్నారని ప్రతాప్ రెడ్డి తెలిపారు.