హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని, నిర్ధేంశించుకున్న గడువు నాటికి 1,600 మెగావాట్ల విద్యుత్తును అందుబాటులోకి తీసుకురావాలని డిప్యూటీ సీఎం భట్టి అధికారులను ఆదేశించారు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పనుల పురోగతిపై శుక్రవారం ఆయన సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. స్టేజీ-1లోని రెండు యూనిట్లకు ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా చర్యలు చేపట్టాని సూచించారు.
గత మూడేండ్లలో జరిగిన పనులపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పర్యావరణ అనుమతులు వచ్చాక చేపట్టే పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసేందుకు రూపొందించాలని మంత్రి ఆదేశించారు. సమావేశంలో ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ పాల్గొన్నారు.