యాదాద్రి : యాదగిరిగుట్ట స్వయంభూ నారసింహుడికి సుప్రభాత సేవోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ‘నిత్యాయా నిరవద్యాయా నిత్యవైభవశీలినే, నిత్యవైభవ ధాత్రేఛా శ్రీనృసింహాయా మంగళం’ అని ఆళ్వారుల మంగళాశాసనం చేసి విధివిధానంగా సేవ సాగింది. తెల్లవారుజామున బ్రహ్మి ముహూర్తంలో ‘కౌసల్యా సుప్రజా రామపూర్వ సంధ్యా ప్రవర్తతే’ అంటూ స్థాన సుప్రభాతాన్ని ఆలకించి స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం స్వయంభువులకు తిరువారాధన, బాలబోగం, నిజాభిషేకం, నివేదన, నిత్యబలి ప్రదానం మంగళాశాసనంతో ప్రాబోదిక కార్యక్రమానికి ముగింపు పలికి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సాయంత్రం ముఖ మండపంలో స్వామివారిని దివ్య మనోహరంగా అలంకరించి ఆస్థానంపై వేంచేపు చేశారు. నాలుగు వేదాలు స్వామివారికి పారాయణం చేసి, స్వామివారి స్వస్తి మంత్రార్థ వంటి మంత్రాలతో శాంతింపజేశారు.
అనంతరం స్వామివారిని గర్భాలయంలో వేంచేపు చేశారు. ఉత్సవమూర్తికి ఉభయ జోడు సేవలను నిర్వహించారు. భక్తులు కోరిన వాహనంపై స్వామి, అమ్మవార్లను వెంచేపు చేసిన జోడు సేవలను తిరవీధిలో ఊరేగించారు. అనంతరం సాయంకాలపు ఆరాధన చేపట్టి సహస్రనామార్చన, ఆమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు పవళింపు సేవను నిర్వహించి భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం ద్వార బంధనం చేపట్టి ఆలయాన్ని మూసివేశారు.
కార్తిక మాసం సందర్భంగా స్వామివారి ఆలయంలో సత్యనారాయణ వ్రతాలు, దీపారాధన పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామివారి దర్శనాలు కొనసాగాయి. 22వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలను కలుపుకొని స్వామివారికి రూ. 27,83,363 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.