యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దివ్యాలయంలో క్షేత్ర పాలకుడైన ఆంజనేయస్వామిని ఆరాధిస్తూ ఆకు పూజ చేపట్టారు. యాదాద్రి క్షేత్రానికి పాలకుడిగా విష్ణు పుష్కరిణి చెంతగల గుడిలో హనుమంతుడిని సింధూరంతో అలంకరించి అభిషేకించారు. తమలపాకులతో అర్చన చేపట్టారు.
వేద మంత్రాల మధ్య జరిగిన పూజల్లో పలువురు భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. తమలపాకులతో అర్చన చేశారు. లలితాపారాయణం చేశారు. ఆంజనేయస్వామి వారికి ఇష్టమైన వడపప్పు, బెల్లం, అరటి పండ్లను నైవేధ్యంగా సమర్పించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
స్వామి వారికి శాస్ర్తోక్తంగా నిత్యపూజలు
యాదాద్రి: బాలాలయం ప్రతిష్ఠామూర్తులకు నిజాభిషేకం మొదలుకుని తులసీ అర్చన వరకు నిత్య పూజలు శాస్ర్తోక్తంగా జరిగాయి. ఉదయం 4 గంటలకు సుప్ర భాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేదనలు అర్పించారు. ఉదయం 8 గంటలకు నిర్వహించిన సుద ర్శన ఆళ్వారులను కొలుస్తూ హోమం జరిపారు. ప్రతిరోజూ నిర్వహించే నిత్య కల్యాణోత్సవంలో భక్తులు పరిమితి సంఖ్యలో పాల్గొన్నారు. దేవేరులను ముస్తాబు చేసి గజ వాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు. లక్ష్మీ సమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణ తంతు జరిపారు. కల్యాణ మూర్తులను ముస్తాబు చేసి బాలలయం ముఖ మండపంలో భక్తులను అభిముఖంగా అధిష్టించి కల్యాణ తంతు నిర్వహించారు.
శ్రీవారి ఖాజానాకు రూ. 6,75,418 ఆదాయం
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి ఖజానాకు రూ. 6,75,418 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ. 83,788, రూ.100 దర్శనాలతో రూ. 30,000, వేద ఆశీర్వచనంతో రూ. 516, నిత్య కైంకర్యాల ద్వారా రూ.916, క్యారీబ్యాగుల విక్రయాలతో రూ. 3,830, సత్యనారాయణ స్వామి వ్రతాలతో రూ. 20,000, కల్యాణకట్టతో రూ. 14,000, ప్రసాద విక్రయాలతో రూ. 2,68,930, వాహన పూజలతో రూ. 6,400, టోల్ గేట్ ద్వారా రూ. 840, అన్నదాన విరాళంతో రూ. 11,834, సువర్ణ పుష్పార్చనతో రూ. 58,180, యాదరుషి నిలయంతో రూ. 39,050, పాతగుట్టతో రూ. 15,145, ఇతర విభాగాలతో రూ. 98,708 తో కలిపి స్వామి వారికి రూ. 6,75,418 ఆదాయం లభించిందని ఆలయ అధికారులు తెలిపారు.