యాదాద్రి: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నేడు నారసింహుని తిరుకల్యాణోత్సవం నిర్వహించనున్నారు. మంగళవారం రాత్రి 8 గంటలకు తులాలగ్నంలో సామిఅమ్మవార్ల కల్యాణం నిర్వహిస్తారు. ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామివారికి ప్రభుత్వం తరపున పలువురు మంత్రులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. ఇప్పటికే అధికారులు ఏర్పాట్లను పూర్తిచేశారు. తిరుకల్యాణం నేపథ్యంలో బ్రహ్మోత్సవ మండపాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. కార్యక్రమాన్ని సుమారు 10 వేల మంది భక్తులు తిలకించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
అంతకుముందు స్వామి, అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం ఘనంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లను ప్రత్యేక అలంకారంలో ఆలయ మాఢవీధుల్లో ఊరేగించి, తూర్పు రాజగోపురం ముందు ఎదురెదురుగా అధిష్టింపజేసి ఎదుర్కోలు తంతును నిర్వహించారు. స్వామి తరఫున ఆలయ ఈవో గీతారెడ్డి, అమ్మవారి తరపున ఆలయ చైర్మన్ నర్సింహమూర్తి, మరికొంత మంది అర్చకులు పెండ్లి పెద్దలుగా ఉండి ఎదుర్కోలు తంతును నిర్వహించారు.