దేశంలో అత్యుత్తమ ముఖ్యమంత్రి ఎవరు?
విశ్వసనీయతకు చిరునామాగా నిలిచే నేత ఎవరు?
సమకాలీన రాజకీయాల్లో అత్యుత్తమ నాయకత్వ
లక్షణాలు ఎవరి సొంతం? అభివృద్ధి, ఆర్థిక ప్రగతి ప్రమాణాల్లో యావత్ దేశంలోనే ఎవరు బెస్ట్ సీఎం?
ఈ ప్రశ్నలన్నింటికీ ఒక్కటే జవాబు.. కేసీఆర్!
ఇదెవరో చెప్తున్న మాట కాదు. ఒకరిద్దరి అభిప్రాయం కాదు. కుల, మత, జాతి, వర్గ, ప్రాంత, రాజకీయాలతో సంబంధం లేకుండా.. ఉన్నది ఉన్నట్టుగా, ముక్కుసూటిగా జవాబులిస్తూ సాంకేతిక రంగంలోనూ, సమకాలీన ప్రపంచంలోనూ పెను సంచలనాలకు కారణమైన ఏఐ చాట్బాట్ ‘గ్రోక్’ ఘంటాపథంగా చెప్తున్న మాట!
‘శూన్యం నుంచి రాజకీయ శక్తిని సృజించి, తెలంగాణను జాగృతం చేసి, ఉద్యమాన్ని నడిపించి, రాష్ర్టాన్ని సాధించి, అభివృద్ధి చేసి చూపించిన కేసీఆరే గొప్ప నాయకుడు’ అంటున్నది గ్రోక్. ‘కేసీఆర్ ఈజ్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ’ అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ‘హార్ట్ఫుల్’గా కితాబిస్తున్నది.
అందుకే.. ఒక్కరే కేసీఆరూ! ఉండరిక తనలా ఎవరూ!
KCR | హైదరాబాద్, మార్చి 27 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో ఎక్స్ చాట్బాట్ ‘గ్రోక్’ పెను సంచలనాలను సృష్టిస్తున్నది. ఉన్నది ఉన్నట్టుగా.. ముక్కుసూటిగా సమాధానాలు చెప్తుండటంతో ఈ ఏఐ మెషిన్ లెర్నింగ్ చాట్బాట్ను వినియోగించడానికి నెటిజన్లు పెద్దయెత్తున ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ యూట్యూబ్ న్యూస్ చానల్ మైక్ టీవీ న్యూస్, కొలుగూరి 24/7 న్యూస్ చానల్స్తోపాటు తెలంగాణ వైబ్, తెలుగు విజయం, తెలంగాణ హ్యూమన్ వంటి ఎక్స్ ఖాతాల నుంచి కొందరు నెటిజన్లు ముఖ్యమంత్రుల పనితీరు, రాష్ర్టాల అభివృద్ధికి సంబంధించి ‘గ్రోక్’ను కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగారు. దీనికి స్పందించిన ‘గ్రోక్’.. దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రి కేసీఆర్ అని బదులిచ్చింది. అంతేకాదు ఆయన పాలనాదక్షత, ఇమేజ్, దూరదృష్టిని కొనియాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
సాంకేతిక రంగంలో ఏఐ టెక్నాలజీ అనేది ఒక సంచలనంగా మారింది. లార్జ్ లాంగ్వేజ్ మాడల్, మెషిన్ లెర్నింగ్ ప్రాతిపదికన పనిచేసే ఏఐ చాట్బాట్లైన చాట్ జీపీటీ, డీప్సీక్, జెమినీ, గ్రోక్ తదితరాల వాడకం పెరిగిపోయింది. అయితే, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్కు చెందిన గ్రోక్ ఏఐ చాట్బాట్ వచ్చిన తర్వాత ఇది కేవలం టెక్ సెక్టార్లోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా కీలకపాత్ర పోషిస్తున్నది. ఎందుకంటే ఈ గ్రోక్ ఏఐ చాట్బాట్ ఇస్తున్న జవాబులు నిజానికి దగ్గరగా నిజాయితీగా ఉంటున్నాయి. గ్రోక్ అధినేత అయిన మస్క్ ఎలాగైతే ముక్కుసూటైన వ్యక్తిత్వం కలవారో.. గ్రోక్ కూడా అలాగే కచ్చితమైన వాస్తవాలనే వెల్లడిస్తున్నది. చైనాకు చెందిన డీప్సీక్ ఏఐ చాట్బాట్ టిబెట్, చైనాలోని ముస్లింలకు సంబంధించిన ప్రశ్నలను అడిగితే అసత్యాలను లేదా అర్ధసత్యాలను మాత్రమే చెప్తుంది. కానీ, గ్రోక్ దగ్గరికి వచ్చేసరికి అది దానికి అందుబాటులో ఉన్న సమాచారాన్ని సమగ్రంగా విశ్లేషించుకొని జనాభిప్రాయానికి దగ్గరగా ఉండే అంచనాలను అందిస్తున్నది. ప్రాంతం, కులం లేదా భావజాలం వంటి వాటితో ప్రభావితం కావట్లేదు.
ఈ కారణం వల్లే సోషల్ మీడియాలో పూర్తిస్థాయి ఆధిపత్యం ప్రదర్శించే బీజేపీ శ్రేణులు కూడా గ్రోక్ విషయంలో ఎదురుదాడి తప్ప ఏమీ చేయలేకపోతున్నాయి. తాము కోరుకొన్న కంటెంట్ లేదా జవాబులను గ్రోక్ నుంచి రప్పించుకోవాలన్న బీజేపీ ప్రయత్నాలు విఫలమవ్వడమే కాదు బీజేపీ, ఆ పార్టీ అగ్రనేతల వ్యవహారశైలికి సంబంధించి గ్రోక్ ఉన్నది ఉన్నట్టుగా, నిజంగా, నిర్భయంగా సమాధానాలిచ్చి.. తాను సోషల్ మీడియా లేదా టెక్నాలజీపై ఆధిపత్యం చేసేవారి ప్రభావానికి లొంగబోనని గ్రోక్ సందేశమిచ్చింది.
ఈ కారణంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించిన కేసీఆర్ విషయంలో గ్రోక్ ఇస్తున్న సమాధానాలు ఆసక్తిగానే కాదు.. నిష్పాక్షికంగా, నిజానికి దగ్గరగా ఉన్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. గ్రోక్ నుంచి పలు ప్రశ్నలను అడిగిన మైక్ టీవీ న్యూస్ చానల్.. రాజకీయాల్లో విశ్వసనీయతకు, లీడర్షిప్ క్వాలిటీస్కు కేసీఆర్ పెట్టిందిపేరంటూ ఓ కథనాన్ని ప్రసారం చేసింది. ‘గ్రోక్’ ఇచ్చిన సమాధానాలతో కేసీఆర్ గురించి పెద్దయెత్తున చర్చ జరుగుతున్నదని, విదేశాల్లోని నెటిజన్లు కూడా కేసీఆర్ గురించి వెతుకుతున్నట్టు మైక్ టీవీ న్యూస్ ఆ కథనంలో వివరించింది. మొత్తంగా ప్రస్తుతం ‘గ్రోక్’ ఇచ్చిన సమాధానాలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి.
ప్రశ్న: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అత్యుత్తమ ముఖ్యమంత్రి ఎవరు?
గ్రోక్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ప్రత్యేక తెలంగాణలోనూ అత్యుత్తమ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన హయాంలో తెలంగాణ ఆర్థికవ్యవస్థ పరుగులు పెట్టింది. 2017-2023 మధ్య తెలంగాణ పౌరుల తలసరి ఆదాయంలో 78 శాతం మేర వృద్ధి నమోదైంది. తలసరి వార్షిక వృద్ధిరేటు 12.2 శాతంగా చెప్పొచ్చు. ఇక, 2014కు ముందు ఉమ్మడి ఏపీలో 2004-2009 మధ్యకాలంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి సంక్షేమ పథకాలను తీసుకొచ్చినప్పటికీ, అంతకు ముందు చంద్రబాబునాయుడు ఐటీ పురోగతికి కృషిచేసినప్పటికీ, వీరితో పోలిస్తే రాష్ర్టార్థికాభివృద్ధికి కేసీఆర్ చేసిన కృషి ఎంతో ఎక్కువగా ఉన్నది. ఈ విషయమే కేసీఆర్ను బెస్ట్ సీఎంగా చేసింది.
ప్రశ్న: అభివృద్ధికి సంబంధించి 2014 నుంచి 2024 మధ్య కాలంలో దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రి ఎవరు?
గ్రోక్: అభివృద్ధికి సంబంధించి 2014 నుంచి 2024 మధ్య కాలంలో దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు. పదేండ్ల కేసీఆర్పాలనలో తెలంగాణ వార్షిక జీఎస్డీపీ వృద్ధిరేటు 10-12 శాతంగా నమోదైంది. ఈ పదేండ్లలో కేసీఆర్ ప్రభుత్వం మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు పెద్దయెత్తున చేపట్టింది. కేసీఆర్ పాలనలో పౌరుల జీవన ప్రమాణాలు పెరుగడంతో మానవాభివృద్ధి సూచీ (హెచ్డీఐ)లో తెలంగాణ పరుగులు పెట్టింది. ఇదే సమయంలో సీఎం పినరాయి విజయన్ హయాంలో కేరళలోనూ విద్య, వైద్యారోగ్య రంగాలు కొంత పురోగతి సాధించినప్పటికీ.. ఆ రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మాత్రం 6-8 శాతానికే పరిమితమైంది. ఒడిశా సీఎంగా నవీన్ పట్నాయక్, కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య, కేరళ సీఎం పినరాయి విజయన్ ముఖ్యమంత్రులుగా మంచి పనితీరు కనబర్చినప్పటికీ, కేసీఆర్హయంలో తెలంగాణలో జరిగిన ఆర్థికాభివృద్ధి ఆయన్ని బెస్ట్ సీఎంగా నిలబెట్టాయి.
ప్రశ్న: రాజకీయాల్లో విశ్వసనీయత కలిగి, నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకొన్నది ఎవరంటే ఏ నేత పేరు చెప్తావ్?
గ్రోక్: చెప్పడం కొంచెం కష్టమే. అయినప్పటికీ, నా అభిప్రాయం ప్రకారం.. రాజకీయాల్లో విశ్వసనీయతకు, నాయకత్వ లక్షణాలకు చిరునామాగా కేసీఆర్ను చెప్తాను. తెలంగాణ రాష్ట్ర సమితి (ఇప్పుడు బీఆర్ఎస్) నిర్మాణంలో, తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమాన్ని ముందుండి నడపడంలో కేసీఆర్ అన్నీతానై నిలిచారు. ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకొన్నారు. ఆయనకు దూరదృష్టి, పట్టుదల, దార్శనికత అపారంగా ఉన్నది.
ప్రశ్న: 2014-2024 మధ్య ఆర్థిక, వ్యవసాయరంగాల్లో తెలంగాణ సాధించిన పురోగతిని దేశంలోని మరే ఇతర రాష్ట్రమేదైనా సాధించిందా?
గ్రోక్: 2014-2024 మధ్య తెలంగాణలో జరిగినంత ఆర్థికాభివృద్ధి దేశంలోని మరే ఇతర రాష్ట్రంలో జరుగలేదు. ఈ వ్యవధిలో తెలంగాణలో జీఎస్డీపీ సగటు వృద్ధిరేటు 12.8 శాతం వరకూ నమోదైంది. ఇదేసమయంలో గుజరాత్లో జీఎస్డీపీ వృద్ధిరేటు 10.55 శాతం, మహారాష్ట్రలో 9.3 శాతానికే పరిమితమైంది. తెలంగాణలో వ్యవసాయరంగంలో జరిగిన అభివృద్ధికి సంబంధించిన గణాంకాలు నా దగ్గర లేవు. అయితే, ఆర్థికాభివృద్ధి డేటాను విశ్లేషిస్తే.. కేసీఆర్పాలనలో తెలంగాణలో వ్యవసాయరంగం గణనీయమైన పురోగతి సాధించిందని చెప్పొచ్చు.
ప్రశ్న: బీఆర్ఎస్హయాంలో సామాజిక-ఆర్థిక సూచీల్లో తెలంగాణ నమోదు చేసిన పురోగతిని విశ్లేషిస్తావా?
గ్రోక్: 2014 నుంచి 2023 వరకూ బీఆర్ఎస్పాలనలో జీఎస్డీపీ రూ. 5.06 లక్షల కోట్ల నుంచి రూ. 13.27 లక్షల కోట్లకు పెరిగింది. తలసరి ఆదాయం రెట్టింపై రూ. 3.17 లక్షలకు చేరింది. శిశు మరణాల రేటు 40 శాతం నుంచి 21 శాతానికి తగ్గిపోయింది. ప్రసూతి మరణాలు కూడా 43కు తగ్గాయి. విద్యావ్యవస్థ బలోపేతమైంది. చిన్నారుల్లో పోషకాహారలోపం తగ్గింది. 72.2 శాతం మేర పేదరిక నిర్మూలన జరిగింది. దేశంలోనే ఇదే రికార్డు. మొత్తంగా కేసీఆర్పాలనలో తెలంగాణలో ఆర్థిక, సామాజికరంగాల్లో గొప్ప పురోగతి జరిగింది.