బేగంపేట, జూన్ 18: సికింద్రాబాద్లోని కిమ్స్ దవాఖానలో దేశంలోనే తొలిసారి ప్రత్యక్ష ప్రసారంలో శస్త్రచికిత్స నిర్వహించారు. మెడికల్ విద్యపై రెండురోజులపాటు నిర్వహించే ఆర్థోపెడిక్ సదస్సు దవాఖానలో శనివారం ప్రారంభమైంది. ఇందులో దేశం నలుమూలల నుంచి వచ్చిన వైద్య నిపుణులు, జూనియర్ వైద్యులు దాదాపు 2 వేలమంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిపుణులైన వైద్యులు పెల్విన్ ఎస్టెబ్యులర్ లైవ్ కెడావర్ శస్త్ర చికిత్సలు ప్రత్యక్షంగా చేసి చూపించారు. తొలిరోజు కార్యక్రమాన్ని కిమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ బీ భాస్కర్రావు ప్రారంభించారు. లైవ్ సర్జరీకి భారీ స్పందన లభించిందని తెలిపారు
. ఆర్థోపెడిక్ సర్జరీ పితామహుడిగా పేరొందిన ఇండియన్ ఆర్థోపెడిక్ అసోసియేషన్ అధ్యక్షుడ డాక్టర్ రమేశ్కుమార్ సేన్ చండీగఢ్ నుంచి లైవ్ కెడావర్ సర్జరీలు చేశారు. ఈ వర్క్షాపులో కిమ్స్ సీనియర్ కన్సల్టెంట్ ఉదయ్కృష్ణ, ఆర్థోపెడిక్ విభాగాధిపతి ఐవీ రెడ్డి, తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్ (టోసా) అధ్యక్షుడు పీఎన్వీఎస్ఎన్ ప్రసాద్, ట్విన్ సిటీస్ అసోసియేషన్ అధ్యక్షుడు అల్వారెడ్డి,ఉస్మానియా, గాంధీ దవాఖానలకు చెందిన సీనియర్ ఫ్యాకల్టీలు పాల్గొన్నారు.