MOU | హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): ఒప్పందాలు కార్యరూపం దాల్చితే రాష్ర్టానికి మేలే. దావోస్ సదస్సులో ప్రభుత్వంతో కంపెనీలు చేసుకుంటున్న ఎంవోయూలకు ఎటువంటి చట్టబద్ధత లేదు. ఇవి ఇరుపక్షాలు పరస్పర అవగాహనతో చేసుకునే ఒప్పందాలు మాత్రమే. కంపెనీలు పెట్టుబడి పెట్టకుండా వెనక్కుపోయినా ప్రభుత్వం వారిపై ఎటువంటి చర్యలు తీసుకునే అధికారం ఉండదు.
ఈ పెట్టుబడులన్నీ కార్యరూపం దాల్చితే రాష్ర్టానికి మేలు జరుగుతుందనడంలో సందేహం లేదు. పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం రావడమే కాకుండా నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు లభిస్తాయి. అయితే, ఈ ఎంవోయూలు ఎంతవరకు కార్యరూపం దాల్చుతాయనేదే సందేహం. సహజంగా ఒక కంపెనీ పెట్టాలంటే ముందుగా భూమికోసం టీఎస్ఐఐసీకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుతోపాటు ప్రాజెక్టు నివేదిక సమర్పిస్తే వివిధ శాఖల అధికారులతో కూడిన కమిటీ సమావేశమై దీనిపై నిర్ణయం తీసుకుంటుంది.
దరఖాస్తు, ప్రాజెక్టు నివేదిక, ఆర్థికపరమైన అంశాలు సవ్యంగా ఉంటే ఆమోదం లభిస్తుంది. అనంతరం నిర్ణీత ధరను చెల్లించిన తరువాత భూ కేటాయింపు జరుగుతుంది. ఆ తరువాత కంపెనీ ఏర్పాటు చేసి సంవత్సరం, లేక రెండేండ్ల (కంపెనీ సామర్ధ్యాన్నిబట్టి) ఉత్పత్తి ప్రారంభించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో భూ కేటాయింపు రద్దవుతుంది. రూ.500 కోట్లకుపైగా పెట్టుబడితో కూడిన మెగా ప్రాజెక్టులైతే ప్రభుత్వం క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటుంది.
చాలా సంస్థలు ఎంవోయూలకు చూపిన ఉత్సాహం కంపెనీ ఏర్పాటుపై చూపడంలేదనే విమర్శలున్నాయి. హడావుడిగా పెట్టుబడులు ప్రకటించి, ప్రభుత్వంతో ఎంవోయూలు కుదుర్చుకొని అనంతరం పలు కారణాలతో వెనక్కు పోతుంటాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఎంవోయూలన్నీ పెట్టుబడులుగా చెప్పేందుకు అవకాశం లేదు.
రాష్ట్ర ప్రభుత్వంతో కంపెనీల ఎవోయూలు వాస్తవరూపం దాల్చితే రాష్ర్టానికి ఎంతో మేలు జరుగుతుంది. పారిశ్రామికంగా రాష్ట్రం అభివృద్ధి చెందడంతోపాటు ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి. రాష్ర్టానికి ఆదాయం సమకూరుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రపంచ దిగ్గజ కంపెనీ ఫాక్స్కాన్ అప్పటి సీఎం కేసీఆర్తో సమావేశమై రాష్ట్రంలో సుమారు రూ.500 మిలియన్ డాలర్ల పెట్టుబడికి ఒప్పందం చేసుకున్నది.
ఒప్పందం ప్రకారం ప్రభుత్వం భూమి కేటాయించడం, కంపెనీ ఏర్పాటు పనులు చకచకా జరిగిపోయాయి. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో కిటెక్స్ సంస్థ సైతం సుమారు రూ.1500 కోట్ల పెట్టుబడికి రెండేండ్ల క్రితం ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని వెంటనే కంపెనీ ఏర్పాటు పనులు ప్రారంభించింది. వచ్చే మార్చిలోగా కంపెనీ ఉత్పత్తి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఇదే కంపెనీ సీతారాంపూర్లో సైతం మరో యూనిట్ను ఏర్పాటు చేసేందుకు ఒప్పందం చేసుకున్నది. అక్కడ కూడా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. కేసీఆర్ ప్రభుత్వం కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడంతోపాటు వాటిని వాస్తవరూపం దాల్చేవిధంగా కృషిచేసింది.
ఉమ్మడి లక్ష్యంతో రెండు లేక అంతకన్నా ఎక్కువ పక్షాలు కలిసి పనిచేసేందుకు అంగీకరిస్తూ సంతకాలు చేస్తే దాన్ని ఒప్పందంగా చెప్పవచ్చు. దీనికి చట్టబద్థత ఉంటుంది. ఏ పక్షమైనా ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే న్యాయస్థానానికి వెళ్లి నష్ట పరిహారం కోరవచ్చు. ఒప్పంద పత్రంలో నియమ నిబంధనలు సమగ్రంగా, క్షుణ్ణంగా ఉంటాయి కాబట్టి ఏ ఒక్క పక్షమూ సహేతుకమైన కారణం లేకుండా ఒప్పందం నుంచి వెనక్కు వెళ్లే అవకాశం ఉండదు. ఎంవోయూ ఇరు పక్షాలు పరస్పర అవగాహనతో సూత్రప్రాయంగా కుదుర్చుకునే ఒప్పందం మాత్రమే. దీనికి కచ్చితమైన నియమ నిబంధనలు ఏవీ ఉండవు. దీనికి చెల్లుబాటు ఉండదు. న్యాయస్థానంలో సవాల్ చేసే వీలు కూడా ఉండదు.