మణికొండ, ఫిబ్రవరి 1: హైదరాబాద్ మహానగరానికి మరో కలికితురాయిగా నిలిచిపోనున్న శ్రీ రామానుజాచార్య సమతా మూర్తి విగ్రహావిష్కరణ మహోత్సవాలకు బుధవారం నుంచి అంకురార్పణ జరుగనున్నది. ఈ ఉత్సవాలు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ శ్రీరామనగరంలో వైభవోపేతంగా వేదపండితుల మంత్రోచ్చారణతో ప్రారంభం కానున్నన్నాయి. త్రిదండి చినజీయర్స్వామి నేతృత్వంలో 45 ఎకరాల సువిశాల స్థలంలో ఏర్పాటైన ‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ విగ్రహావిష్కరణ సమారోహానికి దేశం నలుమూలల నుంచి పెద్దలు, పీఠాధిపతులు, వివిధ ఆలయాల ప్రధాన అర్చకులు, వేదపండితులు, ప్రముఖులు హాజరు కానున్నారు. ఉదయం సూర్యోదయ నమస్కారంతో మొదలయ్యే గణపతి ప్రథమ పూజతో పాటు వాస్తు, దోషనివారణ, గోమాత పూజలు, 108 ఆలయాల గడప పూజలు, 13 ఆళ్వార్ల గడప పూజలు, హోమగుండాల్లో అంకురార్పణలు జరుగుతాయి. సాయంకాలం ఐదుగంటలకు వేదపండితుల మంత్ర పఠనంతో పూజలు ప్రారంభమై 14న పూర్ణాహుతి వరకు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ వైష్ణవాలయాల నుంచి పీఠాధిపతులు, పండితులు ఈ పూజల్లో పాల్గొనేందుకు ఇప్పటికే ఆశ్రమానికి చేరుకొంటున్నారు.