హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): మీ సెల్ఫోన్ను ఎక్కడైనా పోగొట్టుకున్నారా? లేక ఎవరైనా చోరీ చేశారా? అయినా చింతించనక్కర్లేదు. నేరుగా మీ సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేస్తే వారే మీ ఫోన్ జాడ కనిపెడతారు. అవసరమైతే ఆ ఫోన్లోని విలువైన వ్యక్తిగత సమాచారం ఇతరులకు చేరకుండా బ్లాక్ కూడా చేస్తారు. బుధవారం (మే 17) నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ కొత్త విధానం అమల్లోకి రానున్నది. ప్రపంచ టెలికం దినోత్సవం సందర్భంగా రాష్ట్ర పోలీస్ శాఖ (సీఈఐఆర్) సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) పేరుతో ప్రత్యేక సాఫ్ట్వేర్ను ప్రవేశపెడుతున్నది. స్మార్ట్ఫోన్ పోయినా, చోరీకి గురైనా సీఈఐఆర్ ద్వారా బ్లాక్ చేయవచ్చు. ఆ తర్వాత ఆ ఫోన్ ఐఎంఈఐ నంబర్ను ఉపయోగించి దేశంలో ఎక్కడున్నా వెతికి పట్టుకోవచ్చు. ఇందుకోసం www.ceir.gov.in వెబ్సైట్లో లాగిన్ కావాల్సి ఉంటుంది.
ఎవరైనా ఫోన్ను పొగొట్టుకుంటే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. సరైన ఆధారాలతో మీరిచ్చిన ఫిర్యాదును సీఈఐఆర్లో నమోదు చేస్తారు. పోయిన ఫోన్లను వెతికి పట్టుకునేందుకు తెలంగాణలో 718 పోలీస్ స్టేషన్లకు లాగిన్స్ ఇచ్చారు. బాధితులు ఈ లాగిన్స్ ఉన్న ఏ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా వాటిని వెతికే బాధ్యతను పోలీసులే తీసుకుంటారని డీజీపీ అంజనీకుమార్ సోమవారం ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. ఆ ఫోన్లో కొత్త సిమ్కార్డు వేసినా వెంటనే పోలీసులకు తెలిసిపోతుంది. దాన్ని ఎవరు వాడుతున్నారు? ఏ నంబర్తో వాడుతున్నారు? వారి లొకేషన్ ఎక్కడున్నది? అనే విషయాలన్నింటినీ ఇట్టే కనిపెట్టేయవచ్చు. ఈ కొత్త టెక్నాలజీపై పోలీస్ శాఖ ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 750 మంది పోలీస్ అధికారులకు ఈ టెక్నాలజీపై, పోయిన ఫోన్లను కనిపెట్టడంపై శిక్షణ ఇచ్చారు. దీంతో సోమవారం రాత్రి 7.30 వరకు దేశవ్యాప్తంగా 4,79,511 ఫోన్లను బ్లాక్ చేయగలిగారు. మరో 2,43,404 ఫోన్లను ట్రేస్ చేయగలిగారు.