వరంగల్, హనుమకొండ : ఈ నెల 18న ప్రపంచ వారసత్వ దినోత్సవం(Heritage Festival) సందర్భంగా రూపొందించిన వాల్ పోస్టర్ను శనివారం హనుమకొండ(Hanumakonda )లోని హరిత హోటల్లో రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు(Ministers Errabelli Dayakar Rao ), సత్యవతి రాథోడ్(Satyavati Rathode) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా 255 కట్టడాలు యునెస్కో( UNESCO) వారసత్వ హోదా గుర్తింపు కోసం పోటీ పడగా రామప్ప కట్టడం యునెస్కో జాబితాలో చోటు సంపాదించుకోవడం భారతీయులందరికీ గర్వకారణమన్నారు.
యునెస్కో రామప్పకు వారసత్వ హోదా ఇవ్వడం ద్వారా ఎనిమిది వందల సంవత్సరాల నాటి దేవాలయానికి తగిన గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. ఇసుకపై ఆలయాన్ని నిర్మించడం. నీటిలో తేలియాడే ఇటుకలతో గోపురాన్ని నిర్మించడం. ఆలయ నిర్మాణానికి వాడిన రాతి రంగు నేటికీ కోల్పోకుండా ఉండడం ప్రత్యేకతలని అభివర్ణించారు. జాతీయ వారసత్వ సంపదగా ఉండి, అంతర్జాతీయ గుర్తింపు పొందిన రామప్ప ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉందని అన్నారు.
ఆలయ అభివృద్ధికి కేంద్ర సహాయం కోసం ఎదురు చూడకుండా సీఎం కేసీఆర్(CM KCR) తెలంగాణ రాష్ట్రం తరపున రూ.4.21 కోట్ల నిధులు మంజూరు చేయగా పరిరక్షణ పనులు చేపట్టామన్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి రూ.10 లక్షలు, రోజు వారి నిర్వహణకు రూ.82 లక్షలు, రూ. 3 కోట్లతో కామేశ్వరాలయ పునరుద్ధరణ పనులు చేపడుతున్నామని వెల్లడించారు.
ఈనెల 18న నిర్వహించే వేడుకల్లో ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ ఎస్ తమన్, ప్రముఖ డ్రమ్స్ వాయిద్య కారుడు శివమణి, సింగర్ కార్తిక్, ప్లూటిస్ట్ నవీన్ తో పాటు 300 మంది కళాకారులు తమ ప్రదర్శనలతో పర్యాటకులను ఆకట్టుకునేలా సంగీత విభావరిని నిర్వహిస్తున్నామని మంత్రులు వెల్లడించారు. ఇటీవల విడుదల ప్రజాదరణ పొందిన బలగం సినిమా ప్రదర్శన పై కూడా ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డి, శంకర్ నాయక్, వరంగల్ మహానగర మేయర్ గుండు సుధారాణి, ములుగు, భూపాలపల్లి కలెక్టర్లు ఇలా త్రిపాఠి, భవేష్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు.