CM KCR | తెలంగాణ కోసం తన ఆట, పాటలతో స్వరాష్ట్ర చైతన్యాన్ని రగిలించి ‘ప్రజా యుద్ధనౌక’గా గద్దర్ ప్రజల హృదయాల్లో నిలిచారని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. తెలంగాణ పాటకు ప్రపంచ ఖ్యాతి తెచ్చిన ప్రజా వాగ్గేయకారుడు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో తన పాట ద్వారా పల్లె పల్లెనా భావజాల వ్యాప్తిచేసిన గద్దర్ మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని కేసీఆర్ పేర్కొన్నారు. ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపాపం ప్రకటించారు.
తన జీవితాన్ని ప్రజలకే అంకితం చేసి ప్రజల కోసమే బతికాడని, గద్దర్ మరణంతో యావత్ తెలంగాణ గొప్ప ప్రజా కవిని కోల్పోయిందని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం గద్దర్ చేసిన సాంస్కృతికపోరాటాన్ని, గద్దర్తో తనకున్న అనుబంధాన్ని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా స్మరించుకున్నారు. సాధారణ బుర్రకథ కళాకారుడిగా ప్రారంభమైన గద్దర్ కళాజీవితం, విప్లవ రాజకీయాలతో మమేకమై, అనంతరం తెలంగాణ సాధన కోసం సాగిన ఉద్యమంలో సాంస్కృతిక పోరాటంలో ఉన్నతస్థాయికి చేరిందని తెలిపారు. కవిగా గద్దర్ ప్రజా కళలకు, ఉద్యమాలకు చేసిన సేవలు మరుపురానివని, ఆయన లేని లోటు పూడ్చలేనిదని పేర్కొన్నారు. ప్రజా కళాకారులకు కవులకు మరణం ఉండదని, ప్రజాకళలు వర్ధిల్లినంతకాలం గద్దర్ పేరు అజరామరంగా నిలిచి ఉంటుందని సీఎం తెలిపారు. శోకతప్తులైన వారి కుటుంబసభ్యులకు, అభిమానులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.