హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ)/అమీర్పేట : పర్యావరణానికి హాని చేస్తున్న ప్లాస్టిక్ వి నియోగాన్ని తగ్గించి ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సనత్నగర్లోని టీఎస్పీసీబీ కేంద్ర కార్యాలయంలో ‘సొల్యూషన్స్ టు ప్లాస్టిక్ పొల్యూషన్స్’ అంశంపై నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి అల్లోల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఏటా 35 లక్షల టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతున్నదని, కానీ అందులో 30 శాతం మాత్రమే రీసైకిల్ జరుగుతున్నదని పేర్కొన్నారు. రాష్ట్రంలో రోజుకు 365 టన్ను ల ప్లాస్టిక్ వ్యర్థాలు బయటకు వస్తున్నట్టు తెలిపారు. రాష్ర్టాన్ని జీరో ప్లాస్టిక్ స్టేట్గా మార్చేందుకు కలిసికట్టుగా పనిచేయాల్సి ఉందన్నారు. ప్లాస్టిక్ వినియోగానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. కేసీఆర్ తొలిసారి సీఎం అయ్యాక రాష్ట్రంలో ఇన్వెర్టర్లు, జనరేటర్లు కనిపించకుండా పోయాయని, మూడోసారి అధికారంలోకి వస్తే ప్లాస్టిక్ పనిపడతామని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. కాలుష్య నియంత్రణలో ఉత్తమ ప్రమాణాలు పాటించిన పలు సంస్థలకు బహుమతులు అందించారు.
హరితోత్సవం పోస్టర్ ఆవిష్కరణ
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 19న హరితోత్సవం నిర్వహిస్తున్నట్టు మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. సచివాలయంలో సోమవారం అటవీ అధికారులతో కలిసి హరితోత్సవం పోస్టర్ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 19న హరితోత్సవంలో భాగంగా తొమ్మిదో విడత హరితహారాన్ని ప్రారంభించనున్నట్టు పేర్కొన్నారు.
ఉత్తమ గ్రామపంచాయతీగా పర్లపల్లి
పర్యావరణ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా పర్లపల్లి ఉత్తమ గ్రామపంచాయతీగా ఎంపికైంది. ఉత్తమ కార్పొరేషన్లుగా కరీంనగర్, పీర్జాదిగూడ, ఉత్తమ మున్సిపాలిటీలుగా మణికొండ, సిరిసిల్ల, సూర్యాపేట ఎంపికైనట్టు పీసీబీ తెలిపింది. రాష్ట్రంలో ఒకే ఒక్క గ్రామాన్ని ఉత్తమ పంచాయతీగా ఎంపిక చేయగా, ఆ అవార్డు పర్లపల్లికి దక్కింది. మంత్రులు అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్ చేతుల మీదుగా సర్పంచ్ మాదాడి భారతీనర్సింహారెడ్డి అవార్డు అందుకున్నారు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ అవలంబిస్తున్న పర్యావరణహిత మైనింగ్, విద్యుత్ ఉత్పత్తి చర్యలకు సింగరేణి కూడా ప్రతిష్టాత్మక పురసారం అందుకుంది.