హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ) : వ్యవసాయ యూనివర్సిటీ: విత్తన రంగంలో ప్రపంచానికే తెలంగాణ రోల్మాడల్గా ఎదిగిందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో తెలంగాణ అంతర్జాతీయ విత్తన పరీక్ష కేంద్రం (టీఐఎస్టీఏ) ఐదు రోజుల అంతర్జాతీయ స్థాయి విత్తన పరీక్ష వర్క్షాప్ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సాగులో విత్తనాన్ని ఒక ప్రముఖ అంశంగా భావించి, విత్తన రంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి తెలంగాణను ప్రపంచ విత్తన భాండాగారంగా తీర్చిదిద్దామని చెప్పారు. తెలంగాణలో ఉత్పత్తి అవుతున్న విత్తనాలు దేశంలోని పదహారు రాష్ర్టాలతోపాటు, ప్రపంచ దేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయని తెలిపారు. తెలంగాణలో నాణ్యమైన విత్తనోత్పత్తికి మంచి అవకాశాలున్నాయని అంతర్జాతీయ విత్తన నిఫుణుడు దక్షిణాఫ్రికా ప్రతినిధి ఎడ్డీ గోల్డ్శాగ్ అన్నారు. పదేండ్ల క్రితం ఈ ప్రాంతమంతా ఎడారిని తలపించేదని, ప్రస్తుతం అంతా పచ్చదనంగా మారి, ప్రపంచ దేశాలకు ఆదర్శమైందని కొనియాడారు. ఈ వర్క్షాప్లో అంతర్జాతీయంగా అనుభవజ్ఞులైన విత్తన ప్రముఖులచే శిక్షణ ఇస్తున్నామని విత్తన ధృవీకరణ సంస్థ ఎండీ, ఇస్టా అధ్యక్షుడు కేశవులు అన్నారు. తొలిరోజు స్విట్జర్లాండ్కు చెందిన ఆండ్రీయాస్ వైస్, జర్మనీ, ఫ్రాన్స్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ తదితర దేశాల నుంచి 16 మంది ప్రతినిధులు శిక్షణ పొందారు.