హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): క్రోధి నామ సంవత్సరంలో కుజుడు అధిపతిగా ఉండటం వల్ల వాహన, అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని, ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని, వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, నదులన్నీ బాగా ప్రవహస్తాయని, తద్వారా పాడి పంటలు మంచిగా ఉంటాయని సిద్ధాంతి ప్రణీత్కుమార్ తెలిపారు. వరి, గోధుమ, కూరగాయల వ్యాపారులకు, వ్యవసాయదారులకు యోగ్యమైన సంవత్సరంగా ఉంటుందని చెప్పారు. ఆగస్టు వరకు సుముహూర్తాలు కనిపించడం లేదని తెలిపారు.
రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో పాలకపక్షంగా ఉన్నవారికి కొంత కష్ట సాధ్యంగా ఉంటుందని, ప్రతిపక్షంగా ఉన్న వారు ప్రయత్నం చేస్తే దిగ్విజయ ఫలితాలు దక్కే అవకాశం కనిపిస్తున్నదని పేర్కొన్నారు. మంగళవారం తెలంగాణభవన్లో శ్రీక్రోధి నామ సంవత్సరం ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు హాజరయ్యారు. సిద్ధాంతి ప్రణీత్కుమార్ ఉగాది పంచాగం చదివారు. ఈ సందర్భంగా క్రోధి నామ సంవత్సరాల విశేషాలను వివరిస్తూ.. సంవత్సరం మధ్యలో వచ్చే ఆహార కొరత వల్ల ఎగుమతి రంగం ఇబ్బందికరంగా ఉంటుందని పేర్కొన్నారు. ధరలు అధికమవుతాయని తెలిపారు.
బీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్రావుది కర్కాటక రాశి అని, ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6గా ఉంటుందని సిద్ధాంతి తెలిపారు. గురుడు మంచి స్థానంలో ఉన్నాడని, ఈ సంవత్సరం బాగున్నదని వివరించారు. వ్యవహారాల్లో మంచి విజయం చేకూరే అవకాశాలు ఉన్నాయని వివరించారు. ఏ ఎత్తుగడలు వేస్తారో వాటన్నింటికీ ప్రజాబలం లభిస్తుందని చెప్పారు. వ్యక్తిగతంగా మంచి పేరు, ప్రతిష్ఠలు ఉన్నాయని, ఆరోగ్యపరంగా మాత్రం జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఎక్కువ ప్రయాణాలు చేయొద్దని, వాహన ప్రమాద సూచన ఉన్నదని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. దోష నివారణకు లక్ష్మి, మోహన గణపతిని ఆరాధించాలని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ది మకర రాశి అని, ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 3, అవమానం 1గా ఉన్నదని తెలిపారు. ఈ రాశి వారు ఏ పనిచేసినా బ్యాలెన్స్గా చేయాలని, మాటను కట్టడి చేసుకోవడం వల్ల, మృదువుగా మాట్లాడం వల్ల, చక్కటి ఉపకారాన్ని, అభిమానాన్ని పొందగలుగుతారని చెప్పారు. వ్యాపారం రంగంలో కూడా అభివృద్ధి చెందే వారు ఈ రాశివారని అన్నారు. సన్నిహితుల్లో కొంతమంది తమను దూరం పెట్టారని భ్రమించి దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తారని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కేటీఆర్ ఇటు ప్రజల్లో, అటు పార్టీలో అందరి అభిమానాన్ని పొందగలుగుతారని తెలిపారు. జాగ్రత్తగా ఉంటే ఎన్నికల్లో మంచి పట్టు సాధించే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. మకర రాశి వారు జ్యోతిర్లంగ దర్శనం చేసుకోవాలని, రుద్రయాగాలు చేయాలని సూచించారు.
రాష్ట్ర ప్రజలతోపాటు దేశ, విదేశాల్లో ఉన్న తెలుగు వారందరికీ కేటీఆర్ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. క్రోధి నామ సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. శాంతి సామరస్యాలతో ఎలాంటి మత కలహాలు జరగకుండా, సుఖ సంతోషాలతో, శాంతి సామరస్యంగా, ఆరోగ్యంగా ఉండాలని అభిలషించారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, వ్యవసాయం బాగుండాలని, వాతావరణం అనుకూలంగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతున్ని ప్రార్థిస్తున్నానని చెప్పారు.
కార్యక్రమంలో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, సబితా ఇంద్రారెడ్డి, మహముద్ అలీ, చేవేళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్రెడ్డి, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, కాలే యాదయ్య, సంజయ్కుమార్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గ్యాదరి బాలమల్లు, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్వర్రెడ్డి, ఆనంద్, మాజీ ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్రెడ్డి, జీహెచ్ఎంసీ కార్పొరేటర్ మన్నె కవిత, బీఆర్ఎస్ నాయకులు మన్నె గోవర్థన్రెడ్డి, కే విప్లవ్కుమార్, రూప్సింగ్, వాసుదేవరెడ్డి, దూదిమెట్ల బాలరాజుయాదవ్, తుంగ బాలు తదితరులు పాల్గొన్నారు.