నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఫిబ్రవరి 16: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలపై నిరసన జ్వాల వెల్లువెత్తింది. శుక్రవారం నిర్వహించిన దేశవ్యాప్త కార్మిక సమ్మె, గ్రామీణ భారత్ బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా ప్రజాసంఘాలు, వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు నిర్వహించారు. నల్లబ్యాడ్జీలతో నిరసనలు, ధర్నాలు చేసి కేంద్రంలోని బీజేపీ కార్మిక వ్యతిరేక విధానాలపై మండిపడ్డారు. ఉమ్మడి వరంగల్ జిల్లా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం, గణపురం, మహదేవపూర్, జనగామ జిల్లా కేంద్రం, దేవరుప్పుల, మహబూబాబాద్, కురవి, ఇనుగుర్తి, కేసముద్రం, డోర్నకల్, బయ్యారం, గార్ల మండలాల్లో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు తీసి ధర్నా చేశారు. తొర్రూరు, నర్సింహులపేట, పెద్దవంగర, చిన్నగూడూరులో మహాప్రదర్శన నిర్వహించారు. ములుగు ప్రభుత్వ దవాఖానలో కార్మికులు, వైద్య సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. వాజేడు, వెంకటాపూర్(నూగూరు)లో ర్యాలీ, వరంగల్ ఎంజీఎం సెంటర్లో మానవహారం చేపట్టారు. నర్సంపేట, నెక్కొండ, వర్ధన్నపేట, హనుమకొండ జిల్లా కాజీపేట, కమలాపూర్లో ర్యాలీలు నిర్వహించారు.
ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కార్మిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం రాస్తారోకోలు, నిరసన ర్యాలీలు నిర్వహించారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి జోగు రామన్న పాల్గొన్నారు. నిర్మల్ పట్టణంతోపాటు నిర్మల్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, గోలేటి సీహెచ్పీల వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఏరియాలోని ఖైర్గూడ ఓసీపీ, బీపీ ఏవోసీపీ గనులతో పాటు వివిధ డిపార్ట్మెంట్లు, గోలేటి జీఎం కార్యాలయంలో కార్మికులు, ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. పెంచికల్పేట్, మంచిర్యాల, కోటపల్లి, దండేపల్లి, శ్రీరాంపూర్, నస్పూర్, బెల్లంపల్లి, జైపూర్, మందమర్రిలో వివిధ కార్మిక సంఘాల నాయకులు నిరసన తెలిపారు. తాండూర్, బెల్లంపల్లిలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలో ర్యాలీలు నిర్వహించడంతోపాటు మానవహారం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. కేంద్రం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నిరసనలు హోరెత్తాయి. వివిధ వామపక్ష పార్టీలతోపాటు ఏఐటీయూసీ, వ్యవసాయ కార్మిక సంఘం, ఐఎఫ్టీయూ, ఏఐకేఎస్, సీఐటీయూ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. పలు చోట్ల మానవహారం చేపట్టి రాస్తారోకో చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారత్ బంద్ విజయవంతమైంది. సింగరేణి కార్మికులు విధులకు గైర్హాజరయ్యారు.
ప్రధాని మోదీకి పారిశ్రామికవేత్తలైన అంబానీ, అదానీ ఆర్థిక ప్రయోజనాలే ముఖ్యమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా చేపట్టిన 16వ పారిశ్రామిక సమ్మె, గ్రామీణ భారత్ బంద్కు సంఘీభావంగా శుక్రవారం హైదరాబాద్లోని ధర్నాచౌక్లో బహిరంగసభ నిర్వహించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కార్మికులపై కక్ష సాధింపు చర్యలు చేపట్టిందని దుయ్యబట్టారు. కార్మికుల చట్టాలను మార్చి పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు, బడా వ్యాపారులకు మేలు చేసే చర్యలు తీసుకుంటూ వచ్చారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో వివిధ పక్షాల నేతలు, పలు పార్టీలు, సంఘాల నాయకులు పాల్గొన్నారు.