హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఒకలా, అధికారంలోకి వచ్చాక మరోలా ఆర్టీసీ కార్మికులను మోసం చేయడంతో వారంతా ఆగ్రహంతో ఉన్నారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఆర్టీసీ విలీనంపై పోరాడాల్సిందేనని, యూనియన్లను పునరుద్ధరించడంతోపాటు ఆర్టీసీని కాపాడేందుకు కోట్లాది బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఆయా కార్మిక సంఘాల నేతలు పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో వరుస ఆందోళనలు, నిరసనలకు పిలుపునిచ్చారు. కార్మికులతో చర్చించి పోరాట కార్యాచరణ ప్రకటించారు.
వచ్చే బడ్జెట్లో ఆర్టీసీకి రూ.10వేల కోట్లు కేటాయించాలని, మహాలక్ష్మి నిధులు, ఇతర రాయితీలు చెల్లించి కార్మికులను ఆదుకోవాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, 2021, 2025 వేతన ఒప్పందాలు అమలుచేయాలని డిమాండ్ చేస్తూ.. స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర కమిటీ 23న మహాదీక్షకు పిలుపునిచ్చింది. ధర్నాచౌక్లో ఒక్కరోజు ‘మహాదీక్ష’ చేపడుతున్నది. ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీకి అప్పగించే విషయంలో ఈ నెల 12న సదస్సు నిర్వహించనున్నది.
అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా.. మ్యానిఫెస్టోలోని హామీలను అమలుచేయాలని డిమాండ్ చేస్తూ.. ఆ పార్టీ అనుబంధ కార్మిక సంఘం ఎస్డబ్ల్యూఎఫ్ (ఐఎన్టీయూసీ) 24 నుంచి 26 వరకు సామూహిక నిరాహార దీక్షలు చేపడుతున్నది. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలని, అపాయింటెడ్ డే ప్రకటించాలని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి డిమాండ్ చేశారు. దీక్షలకు సహకరించాలని వివిధ కార్మిక సంఘాల నేతలకు లేఖలు రాశారు.

జనగామ, మార్చి 2 (నమస్తే తెలంగాణ): పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా తమ వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ జనగామ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు సమ్మె బాటపట్టారు. ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ల సంఘం ఆధ్వర్యంలో సోమవారం విధులు బహిషరించి ప్రెస్టన్ గ్రౌండ్లో నిరసన తెలిపారు. వేతనాలు పెంచే వరకు బస్సులు నడిపేది లేదని హెచ్చరించారు. ఈఎస్ఐ, పీఎఫ్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. అద్దె బస్సులు కదలకపోవడంతో గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యం నిలిచిపోయింది. హనుమకొండలో ఎక్స్ప్రెస్ డ్రైవర్లకు రూ.21 వేలు, పల్లె వెలుగు డ్రైవర్లకు రూ.20 వేల వరకు వేతనం ఇస్తుంటే జనగామలో మాత్రం తక్కువ వేతనాలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వేతనాలు పెంచి భరోసా కల్పించాలని కోరారు.