హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): కరోనా మూడో వేవ్ నేపథ్యంలో అవకాశమున్న కార్యాలయాల సిబ్బంది ఇంటి నుంచి పనిచేసే (వర్క్ ఫ్రం హోం) అవకాశం కల్పించాలని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. కరోనా నేపథ్యంలో పలు సూచనలు, సలహాలు పేర్కొంటూ సీఐఐ రాష్ట్ర శాఖ లేఖరాసింది. సామాజిక, ఆర్థిక కార్యకలాపాలను వేర్వేరుగా విభజించాలని, సామాజిక కార్యకలాపాలపై ఆంక్షలు విధించాలని సూచించింది. ఆర్థిక కార్యకలాపాలను యథావిధిగా కొనసాగించేలా చూడాలని పేర్కొంది. మైక్రో జోన్స్ను ఏర్పాటు చేయాలని, వాణిజ్య కార్యకలాపాల్లో అత్యవసర, ఇతర వస్తువులను వేర్వేరుగా చూడొద్దని కోరింది. జనాలు ఒకే దగ్గర గుమికూడే కార్యకలాపాలపై తప్పకుండా ఆంక్షలు ఉండాలని తెలిపింది.