హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో తొలి మహిళా యూనివర్సిటీని ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దానికి ‘తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం(వుమెన్స్ యూనివర్సిటీ)’ అని పేరు ఖరారు చేసింది. ఈ మేరకు కోఠి వుమెన్స్ కాలేజీని మహిళా యూనివర్సిటీగా ఉన్నతీకరించినట్టు విద్యాశాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. త్వరలోనే వందేండ్లు పూర్తిచేసుకోబోతున్న కోఠి వుమెన్స్ కాలేజీని యూనివర్సిటీగా అప్గ్రేడ్ చేస్తూ జీవో -12ను జారీచేశామని తెలిపారు. ఈ జీవోను ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్కు మంత్రి అందజేశారు. ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు రూ.100 కోట్లు కేటాయించామని చెప్పారు. మహిళా వర్సిటీ ఏర్పాటుపై సోమవారం బషీర్బాగ్లోని తన కార్యాలయంలో ఉన్నత విద్యాశాఖ అధికారులతో మంత్రి సమీక్షించారు. ఉన్నత విద్యలో మహిళలు ముందంజలో ఉండేందుకే ఈ వర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నూతన కోర్సులను ప్రవేశపెట్టాలని అధికారులను ఆదేశించారు. వర్సిటీ అవసరాలు, నియామకాలకు సంబంధించిన విధివిధానాలను రూపొందించాలని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రికి సూచించారు. బోధనా సౌకర్యాలు, విద్యార్థినులకు కావాల్సిన వసతులు, మౌలిక సదుపాయాలను సత్వరమే కల్పించాలని ఆదేశించారు.
మహిళా విశ్వవిద్యాలయం పేరుతోనే
కొత్త వర్సిటీ ఏర్పాటుకు గాను 1991 యూనివర్సిటీ యాక్ట్ను సవరిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేశారు. హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటయ్యే ఈ వర్సిటీ సేవలు రాష్ట్రం మొత్తం అందుబాటులో ఉంటాయని జీవోలో పేర్కొన్నారు. 2022 -23 విద్యాసంవత్సరం నుంచే వర్సిటీ తరగతులు ప్రారంభమవుతాయని ప్రకటించారు. ఇక కోఠి మహిళా కళాశాల ఆస్తులు, టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులన్నింటిని ఉస్మానియా వర్సిటీ నియంత్రణలో నుంచి తొలగించి కొత్తగా ఏర్పాటయ్యే మహిళా విశ్వవిద్యాలయానికి బదిలీచేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు జీవోలో తెలిపారు. అసోంలోని జోర్హాట్లో అసోం వుమెన్స్ యూనివర్సిటీ, కర్ణాటకలోని బిజాపూర్లో కర్ణాటక స్టేట్ వుమెన్ యూనివర్సిటీ పేరుతో మహిళా యూనివర్సిటీలను నిర్వహిస్తున్నారు. ఇదే తరహాలో మన రాష్ట్రంలో తెలంగాణ మహిళా యూనివర్సిటీ పేరును ఖరారు చేసినట్టు అధికారులు తెలిపారు.
సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు
రాష్ట్రంలో తొలి మహిళా వర్సిటీ ఏర్పాటుకు ప్రోత్సహించిన సీఎం కేసీఆర్కు మంత్రి సబిత ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వర్సిటీ ఏర్పాటుతో తెలంగాణ విద్యార్థుల కల సాకారమయ్యిందని, దీంతో ఉన్నత విద్యలో మహిళల భాగస్వామ్యం మరింతగా పెరుగుతుందని అన్నారు. విద్యాశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, ఉన్నత విద్యామండలి వైస్చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ, కోఠి మహిళా కళాశాల ప్రిన్సిపాల్ విజ్జుల్లత తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.