చౌటుప్పల్/ నాంపల్లి/ గట్టుప్పల్, అక్టోబర్ 27: మునుగోడు నియోజకవర్గ మహిళలు కేంద్రంలోని బీజేపీ సర్కారు గాలి తీసేశారు. వంటగ్యాస్ ధర పెంపుపై వినూత్న ప్రదర్శనలతో హల్చల్ చేశారు. అచ్చేదిన్ వచ్చేశాయన్న మోదీ పాలనతో సచ్చేదిన్ వచ్చాయని సెటైర్లు వేశారు. ధరల బండబాదుడు దుమ్ముదులిపేశారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల అడ్డగోలు పెంపును కడిగిపారేశారు. గురువారం మునుగోడు నియోజకర్గంలోని పలు మండలాల్లో గ్యాస్ సిలిండర్లతో మహిళలు నిరసన ర్యాలీలు నిర్వహించారు. గ్యాస్ బండకు దండంపెట్టి.. బీజేపీని బొందపెట్టి.. అంటూ నినదించారు. ధర పెరిగి అందకుండా పోయిన గ్యాస్ సిలిండర్ను వేలాడదీసి ఉట్టికొట్టారు. కట్టెల పొయ్యిపై వంట చేసి నిరసన తెలిపారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మలకు అగ్గిపెట్టారు. గట్టుప్పల్ మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయం నుంచి చౌరస్తా వరకు ‘మోదీ డౌన్డౌన్’ అంటూ మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. స్వామి వివేకానంద చౌరస్తాలో కట్టెల పొయ్యిపై వంటలు చేసి, గ్యాస్ సిలిండర్లను ఉట్టికెక్కించారు. చౌటుప్పల్ పట్టణంలోని లక్కారంలో గ్యాస్ సిలిండర్ను మధ్యలో ఉంచి మహిళలు బతుకమ్మ ఆడారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. మాకు బతుకే లేకుండా పాయే ఉయ్యాలో అంటూ పాటలు పాడి నిరసన తెలిపారు. నాంపల్లిలో సుమారు 150 మంది మహిళలు భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చౌరస్తాలో గ్యాస్ బండను ఉరితాడుకు వేలాడదీశారు. ధరలు తగ్గించడం చేతకాకుంటే అధికారం నుంచి దిగిపోవాలని నినదించారు. సంస్థాన్ నారాయణపురం మండలం చిమిర్యాలలో గ్యాస్ సిలిండర్ను చెట్టుకు వేలాడదీసి మహిళలు బతుకమ్మ ఆడారు. 2014లో రూ.410 ఉన్న వంట గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు రూ.1200 అయ్యిందని, గ్యాస్ పొయ్యి పోయి కట్టెల పొయ్యే దిక్కయ్యిందని మోదీ పాలనను ఉతికి ఆరేశారు.
దండవేసి దండం పెడుదాం..
ఈ భారం మోయలేం.. బీజేపీకి ఓటు వేయలేం..
అచ్చేదిన్ కాదు.. ‘సచ్చే’దిన్