హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): ఆడబిడ్డల వృత్తివిద్యాకోర్సులో సిరిసిల్ల ఫైన్ ఆర్ట్స్ కళాశాల మరో కలికితురాయిగా మారనున్నది. రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణలో తొలి మహిళా ఫైన్ఆర్ట్స్ డిగ్రీ కళాశాలను సిరిసిల్లలో నెలకొల్పి, ఈ విద్యా సంవత్సరంనుంచే ప్రారంభించేందుకు ఏర్పాట్లుసాగుతున్నాయి. ప్రభుత్వ ఆధీనంలోనే పూర్తిగా నిర్వహించే అధునాతన కోర్సుగా దీన్ని రూపొందించారు. కేవలం యువతుల కోసం ఫ్యాషన్ డిజైనింగ్, ఇంటీరియర్ డిజైనింగ్, ఫొటో అండ్ డిజిటల్ ఇమేజింగ్ కోర్సులను ప్రభుత్వం ఏర్పాటుచేస్తున్నది. హైదరాబాద్లోని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం రూపొందించిన పాఠ్యప్రణాళికతో ఈ కోర్సులను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నది.
ప్రభుత్వం ఫాం టు ఫ్యాషన్ విధానంతో వరంగల్ (కాకతీయ మెగాటెక్స్టైల్ పార్క్)కు సమాంతరంగా దేశంలో అతిపెద్ద టెక్స్టైల్ పార్క్గా సిరిసిల్లను అభివృద్ధి చేస్తున్నది. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఆధునికతను జోడించడం, విద్యార్థులకు క్షేత్ర పరిశీలన కోసం అనువుగా ఉండేలా సిరిసిల్లలో ఫైన్ఆర్ట్స్ అకాడమీ ఉండాలని ప్రభుత్వం భావించింది. ఈ విద్యాసంవత్సరం నుంచి యువతుల కోసం బీఏ (హానర్స్) కోర్సుతో ఫైన్ఆర్ట్స్ కాలేజీని ఏర్పాటుచేస్తున్నది. మూడు కోర్సుల్లో 40 సీట్ల చొప్పున మొత్తం 120 సీట్లున్నాయి. రాష్ట్రంలోని ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థినులు వీటిలో చేరేందుకు అర్హులు. అడ్మిషన్ ప్రక్రియ, రిజర్వేషన్, మెరిట్ ఆధారంగా సీట్లు భర్తీ చేసేలా రాష్ట్ర గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ విధి విధానాలను రూపొందించింది. రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ సిరిసిల్ల ఫైన్ఆర్ట్స్ కళాశాలలో ప్రవేశాల కోసం దరఖాస్తు గడువును ఈ నెల 30వ తేదీ వరకు పొడగించింది.