కరీంనగర్ : హుజూరాబాద్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో మహిళా భవనాలు నిర్మిస్తామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. కరీంనగర్ జిల్లా హూజూరాబాద్ నియోజకవర్గం వీణవంక మండలంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం బుధవారం వడ్డీ లేని రుణాలు అందించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి హరీశ్ పాల్గొని మాట్లాడారు. హుజూరాబాద్లోని అన్ని గ్రామాల్లో మహిళా భవనాలు నిర్మించనున్నట్లు తెలిపిన మంత్రి మహిళా భవనాల కోసం రూ.4 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్గా ఉందన్నారు.
వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ ఇస్తున్నట్లు చెప్పారు. 57 ఏండ్లకే పెన్షన్ అమలు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. అభయహస్తం డబ్బులు వడ్డీతో సహా తిరిగి ఇస్తామన్నారు. అభయహస్తంతో సంబంధం లేకుండా రూ.2 వేల పెన్షన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. నియోజకవర్గానికి ప్రభుత్వం కేటాయించిన డబుల్ బెడ్రూం ఇండ్లను ఈటల రాజేందర్ కట్టియ్యలేదన్నారు. హుజూరాబాద్కు 4 వేల ఇండ్లు మంజూరైతే ఈటల పట్టించుకోలేదన్నారు. హుజూరాబాద్లో 4 వేల డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించే బాధ్యత తనదన్నారు. సీఎం కేసీఆర్ మాట తప్పని నాయకుడని మంత్రి హరీశ్ పేర్కొన్నారు.
సభలో పాల్గొన్న మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ సాధన తర్వాత కరెంట్ సమస్య తీరిందన్నారు. ఆడబిడ్డలకు తాగునీటి సమస్యలు తీర్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని కొనియాడారు. కల్యాణలక్ష్మితో పేదింటి ఆడబిడ్డలను ఆదుకుంటున్నట్లు చెప్పారు. కేసీఆర్ కిట్తో మహిళలు సంతోషంగా ఉన్నారన్నారు. తెలంగాణలో ఉన్న పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ రాష్ట్ర సర్వోతోముఖాభివృద్ధి సీఎం కేసీఆర్తోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్, టీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.