హైదరాబాద్ : ప్రభుత్వ ఆశయం, సీఎం కేసీఆర్ లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పేదరిక నిర్మూలన సంస్థ ముందడుగు వేసింది. ఇప్పటిదాకా విజయవంతమైన టోకు వర్తకం నుంచి.. ఆన్లైన్ ద్వారా నేరుగా వినియోగదారులకు చేరేలా రిటైల్ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. దేశంలోనే తొలిసారిగా స్వయం సహాయక సంఘాలు, రైతు ఉత్పత్తిదారులతో ఫ్లిప్కార్ట్ చారిత్రాత్మక ఒప్పందం చేసుకున్నది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సమక్షంలో హైదరాబాద్లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవరుల అభివృద్ధి సంస్థలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సెర్ప్ అధికారులు, ఫ్లిప్క్టార్ ప్రతినిధుల మధ్య శనివారం ఒప్పందం జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఎన్నో పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. దుండగన్న వ్యవసాయం ఇప్పుడు పండుగలా మారిందన్నారు. సాగు దిగుబడి పెరిగిందన్నారు. దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ చేరిందని, కొత్తగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను సైతం నెలకొల్పుతున్నట్లు చెప్పారు. గతేడాది రూ.15వేల కోట్ల రుణాలు ఇస్తే.. ఈ సారి మహిళా సంఘాలకు రూ.18వేలకోట్లు రుణాలు ఇస్తున్నట్లు చెప్పారు. కనీసం గ్యారంటీ కూడా అడగకుండా బ్యాంకు మహిళా సంఘాలకు రుణాలిస్తున్నాయని, ఇది మన మహిళా సంఘాలు సాధించిన విజయానికి సంకేతమన్నారు. రాష్ట్ర మహిళా సంఘాలకు దేశంలోనే మంచి పేరుంది.
సాగు, వ్యవసాయోత్పత్తులు, ఇతర ఉత్పత్తుల రంగంలోకి మహిళు వచ్చారన్నారు. మహిళా సంఘాలు ముందుకు రావడంతో దళారుల వ్యవస్థకు బ్రేక్ పడిందన్నారు. మహిళలు నాణ్యమైన వస్తువులు తయారు చేస్తున్నారని, సంఘాలు మన తెలంగాణలో ఉండటం, ఆ శాఖకు మంత్రిగా ఉండడం తనకు గర్వంగా ఉందన్నారు. మహిళల్లో మంచి చైతన్యం వచ్చిందని, అన్ని రంగాల్లో అద్భుతంగా రాణిస్తున్నారంటూ ప్రశంసించారు. అన్ని రకాల సీజనల్ పండ్లు, వ్యవసాయ ఉత్పత్తులను దళారుల ప్రమేయం లేకుండా నేరుగా వినియోగదారులకు చేర్చాలని, కల్తీ లేని, నిఖార్సైన, నాణ్యమైన వస్తువులు విక్రయించాలన్నారు. ప్రస్తుతానికి 100 రకాల ఉత్పత్తులను గుర్తించారని, మరిన్ని వస్తువులను గుర్తించాలన్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా మాట్లాడుతూ రాష్ట్రంలో 4.5 లక్షల గ్రూప్లు.. 48లక్షల మంది సభ్యులున్నారని, రాష్ట్రాలు దేశం దాటి అంతర్జాతీయంగా మార్కెటింగ్ చేస్తున్నారన్నారు.
18వేలకోట్ల బ్యాంకర్లు ఇచ్చిన రుణాలు మహిళల వద్ద పెట్టుబడి ఉన్నాయన్నారు. ఫ్లిప్కార్ట్ ద్వారా పెద్ద మార్కెటింగ్ ద్వారా ప్లాట్ ఫామ్ లభిస్తుందన్నారు. మన ఉత్పత్తులు బాగుండాలనీ, మళ్లీ మళ్లీ మన వస్తువుల్ని వినియోగదారులు కొనుగోలు చేసేలా ఉండాలని, వస్తువులకు ఒక బ్రాండ్ ఏర్పడాలన్నారు. సెర్ప్ సీఓఓ రజిత, ఫ్లిప్కార్ట్ గ్రోసరీ వైస్ ప్రెసిడెంట్ స్మృతి రవిచంద్రన్, డైరెక్టర్ శరత్ సిన్హా ఒప్పంద వివరాలను వివరించారు. 80కిపైగా కేటగిరీలలో 15 కోట్ల ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తున్న ఫ్లిప్కార్ట్తో ఒప్పందంతో ప్రాథమిక దశలో 100కుపైగా వస్తువులు ఉత్పత్తి చేస్తున్న మన స్వయం సహాయక సంఘాలు, రైతు ఉత్పత్తిదారులకు ఈ ఒప్పందం మేలు జరుగుతుందన్నారు. ప్రభుత్వ లక్ష్యం కూడా నెరవేరుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.