హైదరాబాద్, జూన్ 11 ( నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మరో గుణాత్మక మార్పు కనిపిస్తున్నది. మహిళా స్వయం సహాయక సంఘాలు (ఎస్హెచ్జీ) బ్యాంకుల ద్వారా పొందిన రుణాలను వినియోగించే విధానంలో చాలా పెద్ద మార్పు వచ్చింది. రాష్ట్రంలోని ఎస్హెచ్జీలు తమకు బ్యాంకులు ఇచ్చే రుణాల్లో ఎక్కువ మొత్తాన్ని వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలకే వినియోగిస్తున్నట్టు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) చేసిన అధ్యయనంలో వెల్లడైంది. మరికొందరు చిరువ్యాపారాలు చేసుకోవడానికి, స్వయం ఉపాధి, సేవారంగాల్లో పెట్టుబడి పెడుతున్నట్టు తేలింది. ఉమ్మడి రాష్ట్రంలో ఈ పరిస్థితి ఉండేది కాదు.
ఎక్కువ శాతం రుణాలను కుటుంబ, వ్యక్తిగత అవసరాలు, పిల్లల చదువులు, వైద్యం లాంటి వాటికి ఖర్చు పెట్టేవారు. దీంతో వారు తీసుకొన్న అప్పు సంపదను సృష్టించకపోగా, వారిని అప్పుల వలయంలోకి తీసుకెళ్లేది. ఈ విషయాన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం శిక్షణ కార్యక్రమాల ద్వారా వారిలో అవగాహన, చైతన్యం కలిగించింది. దీంతో బ్యాంకు రుణాలను దైనందిన అవసరాల కోసం కాకుండా వర్కింగ్ క్యాపిటల్గా వినియోగించడం అలవర్చుకొన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 30.29% రుణాలను వ్యవసాయం రంగంపై వర్కింగ్ క్యాపిటల్గా, 50.06% రుణాలను ఇన్కం జనరేటింగ్ యాక్టివిటీ (ఐజీఏ) కోసం, 19.65% రుణాలను ఇతర రంగాలకు వినియోగించినట్టు వెల్లడైంది.
2021-22 ఆర్థిక సంవత్సరంలో రుణం ఇచ్చిన మొత్తంలో 96.77% ఉత్పాదక, సేవా రంగాలకు వినియోగించడం విశేషం. ఇందులో వ్యవసాయ రంగంలో వర్కింగ్ క్యాపిటల్గా 38.49%, ఇన్కం జనరేటింగ్ యాక్టివిటీ (ఐజీఏ) కోసం 58.28% వినియోగించినట్టు తేలింది. బ్యాంకు రుణాలను వ్యవసాయ పరికరాల కొనుగోలు, ఉద్యాన పంటల సాగుకు వెచ్చిస్తున్నారు.
మరికొందరు చిరు వ్యాపారాలు చేసుకోవడానికి వినియోగిస్తున్నారు. దీనిద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబాలు ఆర్థికంగా ఎదగడంతో పాటుగా మరికొందరికి ఉపాధి కల్పిస్తున్నాయి. మహిళా సంఘాల సభ్యులు రుణాలను తిరిగి సకాలంలో చెల్లిస్తుండటంతో వారికి రుణ మొత్తాలను పెంచేందుకు బ్యాంకులు ముందుకొస్తున్నాయి.
గత ఏడాది ఎస్జీహెచ్లకు రూ.12,097 కోట్ల రుణం ఇవ్వగా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.17 వేల కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకోవడం గమనార్హం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఒక్కొక్క సంఘానికి సగటున రూ.1.90 లక్షల రుణం మంజూరు కాగా 2021-22లో ఇది రూ.4.82 లక్షలకు పెరగడం విశేషం.