హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తేతెలంగాణ)/నీలగిరి : మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్నది. యథేచ్ఛగా వేల రూపాయలు పంచుతూ ఓట్లను కొనుగోలు చేస్తున్నది. నగదు, మందు, దావత్లు, బహమతులు ఇస్తూ ప్రలోభాలకు గురిచేస్తున్నది. పోలింగ్కు ఒకరోజు ముందు బుధవారం నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో ‘కొంతమందికి పైసలిచ్చి మాకెందుకు ఇయ్యడం లేదు ?’ అని స్థానిక బీజేపీ నాయకులను నిలదీశారు. వారి ఇండ్ల వద్ద ఆందోళన చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కాంగ్రెస్ను మోసం చేసినట్టే.. తమను మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు మండలం కొరటికల్, ఊకొండి గ్రామాల్లో బీజేపీ నాయకులను మహిళలు నిలదీస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘మేమేమైనా కూటికిలేక పోయినమా? నువ్వెత్తుకొచ్చిన కోట్లల్ల వాటా ఇయ్యమన్నమా ? మేం రామంటే బతిలాడి మీటింగ్లకు పిలిచిండ్రు. ఓట్లనాడు 30 వేలు, తులం బంగారం ఇస్తమన్నరు. ఇప్పుడు పైసల్లెవ్వు. బంగారం లేదు. ఊళ్ల ఉన్న బీజేపీ లీడర్లు తిన్నరు. అందరికీ ఒక లెక్కనే ఇయ్యాలె. లేకుంటే లేదు. కొందరికి ఇచ్చుడేంది? మాకు ఇయ్యకుంట పోవుడేంది?’ అని మహిళలు బీజేపీ స్థానిక నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేసిన దృశ్యాలు చక్కర్లు కొడుతున్నాయి.
పదివేలు ఇవ్యాలని చెపితే.. 3 వేలు ఇస్తరా?
నియోజకవర్గంలోని మరో గ్రామంలో.. ‘అక్కడి నుంచి మాకు రూ.10 వేలు ఇయ్యమని చెపితే నడుమల మీరు మింగి.. మాకు రూ.3వేలు ఇస్తరా? అది అందరికీ ఇయ్యరా’ అంటూ మహిళలు బీజేపీ నాయకుడిని నిలదీశారు. దీంతో సదరు నాయకుడు ‘పైసలిస్తనని చెప్పిన గదా.. జరాగండ్రి. మా పైసలు పోలీసులు పట్టుకుండ్రు. వచ్చినంక ఇస్తం’ అని సర్దిచెప్పేందుకు ప్రయత్నాలు చేస్తున్న వీడియో వైరల్ అవుతున్నది.
ప్రచారంలోనే బాహటంగా..
మునుగోడు ఉపఎన్నిక ప్రచారం మొదలైనప్పటి నుంచి రాజగోపాల్రెడ్డి అనుచరులు ఓటుకు 20 వేలు, 30వేలు ఇస్తామని ప్రచారం చేశారు. అనేక గ్రామాల్లో ప్రచార వేదికలపై ‘మన రాజగోపాల్రెడ్డి సార్ ఓటుకు రూ.30 వేలు ఇస్తారు. మహిళలకు తులం బంగారం పెడతడు’ అని ప్రకటించారు. పలుచోట్ల అక్కడే ఉన్న రాజగోపాల్రెడ్డి అడ్డు చెప్పలేదు.
ఎన్నికల ఖర్చు రూ.500 కోట్లు
రాజగోపాల్రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచి బీజేపీలో చేరడానికి ప్రధాన కారణం రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు దక్కడమేనని మునుగోడు నియోజకవర్గ ప్రజలు బలంగా నమ్మారు. ఆ కాంట్రాక్ట్ సొమ్ములో దాదాపు రూ.500 కోట్లు ఖర్చు చేసి ఎన్నికల్లో గెలువాలని పథక రచన చేశారని, అందులో భాగంగా ఎన్నికల షెడ్యూల్ కన్నా ముందే తన ప్రధాన అనుచరులకు, నాయకులకు 200 కార్లు, 500 బైక్లు కొనుగోలు చేశారని జోరుగా ప్రచారం సాగింది. రాజగోపాల్రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, వివేక్ అనుచరులు, బంధువులు మునుగోడుకు కోట్లాది రూపాయలు తరలిస్తూ పోలీసులకు దొరికిపోవడం వీటికి బలం చేకూర్చింది.